ఐటీ కారిడార్ లో రోడ్లు విశాలంగాఉంటాయి కానీ పెరుగుతున్న రద్దీతో ఇరుకుగా మారిపోయాయి. అందుకే ఫ్లైఓవర్లు ఎక్కువగా నిర్మిస్తున్నారు. తాజాగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయింది. జూన్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్కు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి పేరు పెట్టారు.
ఈ ఫ్లైఓవర్ కొండాపూర్ నుండి గచ్చిబౌలి వరకు 1.2 కిలోమీటర్ల పొడవుతో, ఆరు లైన్లతో నిర్మించారు. ఇది గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. – ఔటర్ రింగ్ రోడ్ నుండి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వాహనదారులకు సులభమైన రవాణా సౌకర్యం కల్పిస్తుంది. ఈ ఫ్లైఓవర్ ORRని కొండాపూర్, హఫీజ్పేట్తో అనుసంధానం చేస్తుంది, దీనివల్ల IT ఉద్యోగులు , స్థానికులకు ట్రాఫిక్ బాధల కాస్త విముక్తి కలుగుతుంది.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (SRDP)లో భాగంగా రూ.178 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్, హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు .