ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసేవారు కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానల్ సూచించింది. దీంతో ఏఐ ఆధారిత వీడియోలు, కంటెంట్ కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను అడ్డుకోవడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నివేదికను ఇచ్చింది.
ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. వాటిలో అత్యధికంగా ఫేక్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఫలితంగా గందరోళం ఎక్కువైపోతోంది. ఫేక్ న్యూస్ కట్టడికి ఇప్పటికే యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఉన్నాయి. సాధారణంగా న్యూస్ చెప్పాలంటే.. ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. కానీ యూట్యూబ్ చానళ్లకు ఒక్క ఈమెయిల్ ఐడీ సరిపోతుంది. ఈ కారణంగా కుప్పలు తెప్పలుగా ఫేక్ న్యూస్ కోసం చానళ్లను తెరుస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ కావడంతో.. పరిస్థితి పూర్తిగా కట్టు తప్పింది. ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ఇంకా బరి తెగిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనే మార్గాలను పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేసింది. ఈ కమిటీ ఇటీవలే తమ ముసాయిదా నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. వచ్చే సీజన్ సమావేశాల్లో దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.