తెలుగుదేశం పార్టీకి మహారాజ పోషకులుగా పార్టీ నేతలే ఉన్నారు. మహానాడు వేదికగా టీడీపీకి నేతలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏకమొత్తంగా ఐదు కోట్ల రూపాయలను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇచ్చారు. ఇతర నేతలు కూడా కోట్లలో ఇచ్చారు. ఇప్పటి వరకూ రూ. 30 కోట్లకుపైగా విరాళం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవి కేవలం పార్టీ నేతలు ఇస్తున్న విరాళాలు మాత్రమే. పార్టీ సభ్యత్వం ద్వారా.. ఇతర మార్గాల ద్వారా టీడీపీకి ఆదాయం సమకూరుతోంది.
అయితే బీఆర్ఎస్, వైసీపీలాగా అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి వందల కోట్ల విరాళాలు వచ్చేవి. చివరికి లాటరీ కంపెనీల నుంచి కూడా వచ్చేవి. అయితే టీడీపీ మాత్రం ఇలా ఎలక్టోరల్ బాండ్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటుంది. అందుకే టీడీపీ వద్ద వనరులు పరిమితంగా ఉంటాయి. అయితే పార్టీని ఆర్థిక సమస్యలు లేకుండా నడిపేంత సొమ్ము మాత్రం ఉంటుంది. ప్రతి మహానాడులోనూ పార్టీ నేతలు ఇలా విరాళాలు ఇస్తూంటారు.
పార్టీకి విరాళాలు ఇచ్చారని ప్రత్యేకమైన అర్హతగా వారికి పదవులు, సీట్లు కేటాయించడం ఉండదు. పార్టీపై వారి అభిమానాన్ని ఇలా చూపించుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలోనూ కీలకంగా ఉన్నారు. కానీ అక్కడ ఆయనను అత్యంత ఘోరంగా చూసేవారు. ఆ అవమానాలు భరించలేక టీడీపీలో చేరారు.ఇప్పుడు తనకు చంద్రబాబు ఇచ్చే గౌరవంతో ఆయన పార్టీపై మరింతగా అభిమానాన్ని పెంచుకున్నారు.