మేధావులతో చర్చలే జనసేన జెండా.. ఎజెండా..!

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పార్టీ ప్రారంభించిన నాలుగున్నరేళ్ల కాలంలో… ఏ ఒక్క సమస్యపైనా స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. అటు అమరావతి దగ్గర్నుంచి ఇటు కాపు రిజర్ేషన్ల వరకు దేనిపై స్పష్టమైన విధానం లేదు. ఏ సమస్య వచ్చినా మేధావులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటానంటారు. తను పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించిన తర్వాత.. మొదటిసారి అనంతపురం జిల్లాలో పర్యటించారు. అక్కడి వెనుకబాటు తనంపై ఎంతో బాధపడ్డారు. అనంత కరువుపై మేధావులు, నిపుణులతో చర్చలు జరుపుతానని ప్రకటించారు. ఆ తర్వాతి టూర్‌లో చర్చించారు కూడా. కానీ వారేం చెప్పారు.. పవన్ కల్యాణ్ తన పార్టీ తరపున ఏం చేయబోతున్నారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

ఆ మేధావులతో చర్చలు… అలా కొనసాగుతూనే ఉన్నాయి. చేనేత కళాకారుల, ఉద్దానం కిడ్నీ బాధితులు ఇలా చెప్పుకుంటూ.. పోతే… నిన్నామొన్న విజయవాడలో జరిగిన భూసేకరణ చట్టంపై మేథోమథనం కూడా అదే కేటగిరి కిందకు వస్తుంది. ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశంపైనా అదే వాదన వినిపించారు. ఇంత కాలం వివిధ అంశాలపై మేధావులు, నిపుణులతో జరిగిన చర్చల సారాంశం ఏమిటో.. ఎప్పుడూ చెప్పలేదు. వాటి ఆధారంగా ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో చెప్పలేదు. చివరికి విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందంటూ.. వేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో చర్చలను కూడా ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఆ కమిటీలు నివేదికలు సిద్ధం చేశాయి. కానీ ఏం చేశారో ఎవరికీ తెలియదు.

ప్రతి అంశంపై మేధావులతో చర్చలు జరుపుతూ పోతే ఏం ప్రయోజనం..? వారి విజ్ఞానంతో సమస్యలకు పరిష్కారాలు కనుగొంటున్నారా..? కనీసం వారు ఇలా చెప్పారు.. మా పార్టీ తపున ఇలా చేయాలనుకుంటున్నామని.. కనీసం ఒక్కటంటే.. ఒక్క సమస్యపైనైనా నిర్దిష్టమైన ప్రకటన చేశారా..? ఉత్తరాంధ్ర పర్యటనకు రెండోసారి వెళ్లినప్పుడు… శ్రీకాకుళంలో మేధావులతో సమావేశం నిర్వహించారు. అందరూ రాజకీయ ప్రసంగాలే చేశారు తప్ప.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా శ్రీకాకుళం వెనుకబాటు తనం గురించి.. బయట పడాలంటే ఏం చేయాలన్నదానిపై సూచనలు చేయలేదు. ఇలాంటి రాజకీయ మేధావులతో చర్చించి పవన్ కల్యాణ్ ఏం సాధిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు.

మేధావులంటే.. అదో అన్నట్లుగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. వారిని గొప్పగా భావిస్తున్నారు. కానీ వారిని ఆ స్థాయిలో గౌరవించడం లేదు. కానీ ఏ సమస్య వచ్చినా… జనసేన నుంచి మాత్రం… మేధావలతో చర్చలంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజవుతుంది. తప్పించుకోవడానికి ఆ అప్రకటిత మేధావులే జనసేనకు.. బాగా అక్కరకు వస్తున్నట్లున్నారు.

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.