తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసును కొలిక్కి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాలు అంత సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. పారిపోయిన ఇద్దరు తిరిగి వచ్చారు. అరెస్టు నుంచి రక్షణ పొంది శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు వచ్చారు. వారిని పోలీసులు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కేసును ముందుకు తీసుకెళ్లడం పోలీసులకు ఓ సవాల్గా మారింది.
బీజేపీ అగ్రనేతల ఫోన్లూ ట్యాప్ – కానీ సాక్ష్యాలు ?
ప్రభాకర్ రావును మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆయన విచారణలో ఏమీ చెప్పలేదు. ట్యాపింగ్ చేయలేదని.. చేసినవి కూడా అనుమతితో చేసినవేనని.. ఆ ట్యాపింగ్ రివ్యూకమిటీలోనే తాను లేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే ఎవరివి చేశారో తనకు తెలియదని అంటున్నారు. ఆయన అంతకు మించి వివరాలు చెప్పే అవకాశం లేదు. కానీ గతంలో ప్రణీత్ రావు ..తాము ట్యాపింగ్ చేశామని అంగీకరించారు. ప్రభాకర్ రావు ఆదేశాలోనే చేశామని కూడా చెప్పారు. హార్డ్ డిస్క్ను కూడా ఆయన ఆదేశాలతోనే ధ్వంసం చేశామని సాక్ష్యమిచ్చారు. కానీ ఆ వాంగ్మూలం తప్ప మరో ఆధారం దొరకట్లేదు.
ఇద్దర్నీ కలిపి ప్రశ్నించనున్న పోలీసులు
ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దర్నీ కలిపి పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇద్దరి స్టేట్మెంట్లు భిన్నంగా ఉన్నాయి. ప్రణీత్ రావు.. తాము ప్రభాకర్ రావు చెబితేనే చేశామంటున్నారు.. కానీ ప్రభాకర్ రావు అసలు చేయలేదంటున్నారు. ఇప్పుడు వీరిద్దర్నీ దారికి తెచ్చి.. అసలు కేసును కొలిక్కి తీసుకు రావాల్సి ఉంది. పోలీసుల వద్ద ట్యాపింగ్ కు సంబంధించి కనీస ఆధారాలు ఉన్నా.. గొప్ప విజయం అవుతుంది.
కేసును కొలిక్కి తేవాల్సిన సమయం
ట్యాపింగ్ కేసు సుదీర్ఘంగా సాగుతోంది. ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నందునే ముందుకు సాగడం లేదని ఇప్పటి వరకూ కారణాలు చెప్పారు. ఇప్పుడు అందరూ వచ్చారు. విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కేసు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం., బాధితులు ఎవరైనా ట్యాపింగ్ కేసులో ఉన్నారా అంటే.. అందులో మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ కేసును చట్టపరంగా నిరూపించాల్సిన పరిస్థితి ఆయన ప్రభుత్వంపై ఉంది.