తమకు నచ్చని రాజకీయ నేత క్యారెక్టర్ పై ఇతర పార్టీలకు చెందిన వారు చేసే తప్పుడు ప్రచారాలు అసలు రాజకీయాలతో సంబంధం లేని అతి సామాన్యుల జీవితాల్ని నాశనం చేస్తున్నాయి. అసలు సంబంధం లేని వాళ్లను ఈ ఇష్యూలోకి లాగాలని ిఎలా అనుకుంటారో..అలాంటి ప్రచారాల వల్ల ఇతరుల జీవితాలు నాశనం అయినా పర్వాలేదు తాము చేయాలనుకున్న రాజకీయం చేస్తే చాలనుకుంటున్నారు. సైకోతనాన్ని మించి వ్యవహరిస్తూండంటం దిగజారిపోతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది.
రెండు రోజుల కిందట ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో పని చేసే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎమ్మెల్యే స్వగ్రామానికి చెందిన వ్యక్తి. తమ గ్రామం వాడేనని ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి పని మనుషులుగా పెట్టుకున్నాడు ఎమ్మెల్యే . ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత కన్నా పెద్ద విషయం రాజకీయం చేయడానికి ఉండదని ఇతర పార్టీలకు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ .. ఆ ఆత్మహత్య చేసుకున్న మనిషి భార్యకు..ఎమ్మెల్యేకు వివాహేతర సంబంధం ఉందని రాసేశారు.
అసలే భర్త ఆత్మహత్య చేసుకుని పుట్టెడు దుంఖంలో ఉంటే.. ఆమె క్యారెక్టర్ ను నిందిస్తూ.. ప్రచారం ప్రారంభించారు. ఇలా వివాహేత బంధాలు అంటగట్టాలంటే.. వావివరసలు లేకుండా ఎవరికైనా అంటగట్టవచ్చు. కానీ మనుషులు అన్న సంగతి మరచిపోవాలి. అలా ఆరోపణ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడితే దాని కింద వందల మంది లేకి కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఓ మహిళ జీవితంపై తాము అత్యంత ఘోరంగా చావుదెబ్బ కొడుతున్నామని వారెవరూ అనుకోలేదు.అలాంటి ఆలోచన కూడా రాలేదు. అదే సోషల్ మీడియా సైకోయిజం.
రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేపై ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. కానీ ఏ పాపం తెలియని ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసే హక్కు మాత్రం ఇతరులకు ఉండదు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారో లేదో కానీ.. అలాంట ప్రచారాలు చేసే వాళ్ల మానసిక వైకల్యం మాత్రం బయటపడింది.