బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ను చూసి వైసీపీ క్యాడర్ బావురుమంటున్నారు. తమ పార్టీ లీగల్ సెల్ అత్యంత దారుణంగా ఉంటోందని..రిమాండ్ విధించకూడదని కేసుల్లో కూడా పొన్నవోలు లాంటి వాళ్లు జడ్జిలతో అడ్డగోలుగా వాదన పెట్టుకుని రిమాండ్ విధించేలా చేస్తున్నారని బావురుమంటున్నారు. మరో వైపు తెలంగాణలోని బీఆర్ఎస్ లీగల్ సెల్ మాత్రం ఎవర్నీ జైళ్లకు వెళ్లనీయడం లేదు. వెంటనే బెయిల్స్ వచ్చేలా చేస్తున్నారు. తాజాగా మహా న్యూస్ చానల్పై విధ్వంసం సృష్టించిన వారికీ బెయిల్ వచ్చేసింది.
మహా న్యూస్ పై దాడి చేసిన వారందరికీ బెయిల్
మహాన్యూస్ పై విధ్వంసం వీడియోలతో సహా స్పష్టంగా ఉంది. మీడియా చానల్ పై దాడి అంటే.. సీరియస్ వ్యవహారమే. అయినా ఈ దాడికి నేతృత్వం వహించినట్లుగా ఆరోపణలు ఉన్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎవరూ జైలుకు వెళ్లలేదు. అందరికీ బెయిల్ మంజూరు అయింది. దాంతో జైల్లో అడుగు పెట్టక ముందే అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు.. చాలా వరకూ అరెస్టు అవుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ జైళ్ల వరకూ వెళ్లడంలేదు. పాడి కౌశిక్ రెడ్డిని ఎన్ని సార్లు అరెస్టు చేసినా ఆయన బయటకు వస్తున్నారు. జైలు దాకా వెళ్లడం లేదు. బీఆర్ఎస్ లీగల్ సెల్ బలంగా ఉందని ఆ పార్టీ నేతలు సంబరపడుతున్నారు.
వైసీపీలో పొన్నవోలు లీడింగ్ – అందరికీ రిమాండ్ వేయించడంలో స్పెషలిస్ట్
మరో వైపు బీఆర్ఎస్ మిత్రో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అత్యంత గడ్డుగా ఉంది. ప్రొఫెషనల్ లాయర్లు కాకుండా.. కులానికి ప్రాథాన్యం ఇచ్చి పొన్నవోలు లాంటి .. ఏ మాత్రం వాదనా పటిమ, తెలివి, సహనం లేని లాయర్ కు లీగల్ సెల్ బాధ్యతలిచ్చారు. న్యాయసాయం కావాలంటే ఆయన నేతృత్వంలోనే జరగాలి. ఇప్పటి వరకూ కేసుల పాలైనా ఒక్క కార్యకర్తకు జైలు తప్పించలేకపోయారు. చివరికి కొమ్మినేని వంటి వారికి రిమాండ్ విధించకుండా.. చేయడానికి అవకాశం ఉన్నా.. అసలు ఆ టాపిక్ల గురించి చెప్పకుండా.. జడ్జితో గొడవ పెట్టుకుని రిమాండ్ పడేలా చేసుకున్నారు. ఇప్పుడు ఎంతో మంది వైసీపీ కార్యకర్తలకు న్యాయసాయం లేక జైలు పాలవుతున్నారు.
లీగల్ టీంను మార్చాలని పెద్దలకు వైసీపీ క్యాడర్ సలహాలు
బీఆర్ఎస్ లీగల్ సెల్ ను చూసుకుని నేర్చుకోవాలని వైసీపీ క్యాడర్.. తమ పార్టీ పెద్దలకు సూచనలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంగా బలంగా పోరాడుతున్నారని.. అయినా తమ కార్యకర్తల్ని జైలుకు వెళ్లకుండా చూసుకుంటున్నారని అంటున్నారు. మహా న్యూస్ పై దాడి విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది. ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖండించారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు. అయినా ఆ దాడులకు పాల్పడిన వారిని జైలుకు పంపలేకపోయారంటే.. అలాంటి వారికి మరింత ధైర్యం వస్తుంది. దీన్ని ప్రభుత్వం హ్యాండిల్ చేయాల్సి ఉంది.