ప్రొ.నాగేశ్వర్ : రైల్వేజోన్ ఇచ్చినట్లే మిగతా హామీలు నెరవేరుస్తారా..?

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ రైల్వేజోన్ గురించి ఆందోళనలు చేసిన వారెవరూ సంతృప్తి వ్యక్తం చేయలేదు. రాజకీయ కారణాలతో.. ప్రధాని పర్యటనకు ఒక్క రోజు ముందు జోన్ ప్రకటించారని మండి పడుతున్నారు. కొంత మంది.. ఇప్పుడు ఇచ్చిన రైల్వే జోన్ వల్ల ఉపయోగం లేదని.. సరకు రవాణా ఆదాయం మొత్తం.. వేరే డివిజన్‌కు తరలించడం వల్ల ఏపీ నష్టపోతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. మాయా జోన్ అని విమర్శిస్తున్నారు.

సాధ్యం కాదని ఇప్పుడెలా రైల్వేజోన్ ఇచ్చారు..?

కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని పర్యటనకు రెండు రోజుల ముందు ప్రకటించినా.. రైల్వే జోన్ అయితే ప్రకటించారు కదా..! ఎప్పుడు ప్రకటించినా రైల్వేజోనే. ప్రధాని పర్యటనకు ముందు నిరసనలు వ్యక్తం కాకూడదని.. జోన్ ప్రకటించినప్పటికీ నష్టమేమీ ఉండదు కదా. ఇప్పుడు ప్రకటించిన జోన్‌లో.. ఇతర రాష్ట్రాల్లోని డివిజన్‌లకు రైల్వేలైన్ కేటాయించారని… ఆదాయం పోతుందని చెబుతున్నారు. కానీ గుంతకల్లు రైల్వే జోన్ తో పాటు.. సికింద్రాబాద్ రైల్వేజోన్ లో ఇతర రాష్ట్రాల రైల్వే లైన్లు ఉన్నాయి కదా మరి..!. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు.. రైల్వేజోన్ ఫీజుబుల్ కాదని చెబుతూ వస్తోంది. చివరికి పార్లమెంట్‌లోనూ అదే చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఫీజుబులిటీ అయింది…? . ఇప్పుడు ప్రధాని వస్తున్నారు కాబట్టి.. ఆయనకు నిరసనలు ఎదురు కాకూడదని.. ఫీజబుల్ అయిందా..?. ఏ రాజకీయ కారణాలతో అయితే.. రైల్వేజోన్ ఫీజబుల్ అయిందో.. మిగతా హామీలు కూడా ఫీజుబుల్ చేయండి. కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, పెట్రోలియం కాంప్లెక్స్, తెలంగాణలోని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఈర్.. ఇలా చాలా డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఫీజబుల్ చేయండి.

రైల్వేజోన్‌ సాధ్యం అయినట్లే ఇతర హామీలను నెరవేర్చాలి..!

కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్ ను రాజకీయ కారణాలతో ప్రకటించినా ఆహ్వానించాల్సిందే. రాజకీయ పార్టీలు రాజకీయ కారణాలతోనే నిర్ణయాలు తీసుకుంటాయి. రైల్వేజోన్ డిమాండే రాజకీయ పరమైనది కదా..! రాజకీయంగా డిమాండ్ చేయడం వల్లే.. విశాఖ జోన్ వస్తోంది. ఎందుకంటే.. విశాఖ కంటే.. విజయవాడ జోన్ మరింత సౌలభ్యంగా ఉంటుంది. అదుకే… రైల్వేజోన్ విషయంలో చేస్తున్న డిమాండ్లు రాజకీయ పరమైనవి. కేంద్రం తీసుకుంటున్న చర్యలు కూడా.. రాజకీయ కోణంలోనే ఉంటున్నాయి. అసలు.. రైల్వేజోన్ ఏర్పాటుకు అడ్డంకుల్లేవని… అందరికీ తెలుసు. కానీ.. అధికారుల కమిటి సాధ్యం కాదని నివేదిక ఇచ్చింది. ఇది కూడా రాజకీయ ప్రేరేపితం అని అంచనా వేసుకోవచ్చు. విమర్శలు ఉండవచ్చు కానీ.. ఓ డిమాండ్ అయితే నెరవేరింది. ఇతర డిమాండ్ల నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి.

ఇచ్చిన దాన్ని ఆహ్వానించి .. నష్టం జరిగితే పరిహారం అడగాలి..!

అభ్యంతరాలు ఉన్నా.. ఏ మేరకైనా రైల్వే జోన్ వచ్చింది. ఇందులో.. ఒడిషా విషయం కూడా ఉంది. అక్కడ.. ఉన్న పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకుని… అక్కడ వ్యతిరేకత రాకుండా.. ఇలా చేశారని అనుకోవచ్చు. ఇచ్చినదాన్ని తీసుకుని.. కొత్త జోన్ ఆదాయం ఎలా పెంచుతారో అడగాలి. అందులో సందేహం లేదు. వచ్చిన దాన్ని అహ్వానించి.. ఇంకా ఏం కావాలో అడగాలి. పొలిటికల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అడిగిన డిమాండ్ ఏమిటి… కేంద్రం ఇచ్చినదేమిటి.. రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుని.. చూసుకోవాలి. నష్టం జరిగితే.. ఆ నష్టాన్ని భర్తీ ఎలా భర్తీ చేస్తారని డిమాండ్ చేయాలి. అంటే.. వచ్చిన దాన్ని ఆహ్వానించి.. రావాల్సిన దాని గురించి ఆలోచిస్తేనే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.