అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలను అన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. తన తండ్రి కూడా ప్రమాదంలో మరణించాడు అని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు అని పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై శనివారం రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత మాట్లాడారు.
విమాన ప్రమాద దుర్ఘటనపై ప్రత్యేక అధికారులతో , వివిధ రంగాలకు చెందిన నిపుణులతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు రామ్మోహన్ నాయుడు. ఈ కమిటీలో ఐదుగురు ఉంటారని,అవసరమైతే మరికొంతమంది చేర్చుతామన్నారు. ఈ విమాన ప్రమాద దుర్ఘటనపై విచారణ కోసం ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు.
హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. దర్యాప్తులో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. విచారణ పూర్తి అయ్యాక ప్రమాదానికి గల కారణాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం బ్లాక్ బాక్స్ లభ్యం అయిందని, దాన్ని విశ్లేషించిన తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుందన్నారు. అందుకోసం వెయిట్ చేస్తున్నామన్నారు.