రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను మరోసారి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఈ సారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గత రెండు విడుతలుగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు ఏకంగా 50 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో వడ్డీ రేట్లు దిగి రానున్నాయి. ప్రస్తుతం రెపో రేటు ఆరు శాతంగా ఉంది. ఆర్బీఐ నిర్ణయంతో ఐదున్నర శాతానికి తగ్గుతుంది.
బ్యాంకులు ఈ తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. గతంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న కారణంగా విపరీతంగా వడ్డీ రేట్లు పెంచారు. దాంతో హోమ్ లోన్స్ వంటి వడ్డీ రేట్లు తొమ్మిది, పది శాతానికి చేరుకున్నాయి. ఇవి భారంగా మారడంతో మార్కెట్ తగ్గిపోయింది. హోమ్ లోన్లు తీసుకుని ఇళ్లు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిన తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించారు.
ప్రస్తుతం హోమ్ లోన్స్ ను ఎనిమిది శాతం వడ్డీ రేటుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ రేటు ఇంకా తగ్గనుంది. ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. ఇప్పటికే హోమ్ లోన్స్ వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మరింతగా తగ్గనున్నాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడానికి ఈ తగ్గింపు బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.