తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతాల్లో జరిగే భూముల లావాదేవీల రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు పెంచనున్నారు. ఈ ప్రాంతాలు గత కొన్నేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెట్టుబడులకు అనుకూలంగా మారాయి. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విలువలు గణనీయంగా పెరిగాయి. దీనికి అనుగుణంగా మార్కెట్ ధరలు లేవని ప్రభుత్వం భావిస్తోంది.
విలువలు పెంచితే నేరుగా రేట్లు పెరగవు కానీ.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి. అదే సమయంలో ఆయా స్థలాలు, ఇళ్లపై పెట్టే బ్లాక్ మనీ కూడా తగ్గుతుంది. అసలు రేటుకు..రిజిస్ట్రేషన్ రేటుకు మధ్య ఉండే తేడా అంతా బ్లాక్ మనీతోనే లావాదేవీలు జరుగుతాయన్న అభిప్రాయం ఉంది. అందుకే అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ పై 30 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. ఖాళీ స్థలాలపై కాస్త ఎక్కువగానే పెంచేలా పరిశీలన జరుపుతున్నారు. ఈ పెంపుదల మార్కెట్ విలువల మార్గదర్శకాలకు అనుగుణంగా, వాస్తవ మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండేలా చూసుకోనున్నారు.
రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపుదల కొనుగోలుదారులు, అమ్మకందారులు, రియల్ ఎస్టేట్ రంగంపై కాస్త ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు వ్యయం.. దానిపై చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ మెరుగుపడుతోందని భావిస్తున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. సమస్యలు వస్తాయని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.