అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇలా గాల్లోకి కొంత దూరం లేచి.. అలా పడిపోయింది విమానం. అసలు ఎగరలేకపోయింది. అంటే విమాన వ్యవస్థ మొత్తం సెకన్లలోనే పాడైపోయింది. సాధారణంగా విమానాల్లో సాంకేతిక లోపాలు వచ్చినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకునేలా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. గాల్లో పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోవడం అనేది దాదాపుగా అసాధ్యం. కానీ పూర్తిగా గాల్లోకి ఎగరక ముందే అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం నియంత్రణ కోల్పోవడం కాదు అసలు పూర్తిగా గాలిపటంలా మారిపోయింది.
ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మానవ తప్పిదమేనని చెప్పాల్సిన పని లేదు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని.. ఏసీలు పని చేయలేదని తాము ముందే చెప్పామని అంతకు ముందే అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన కొంత మంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. ఇంకా అనేక మంది ఆ ఫ్లైట్ హిస్టరీని తీశారు. కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందని.. ఇటీవల ఆ విమానానికి రిపేర్లు చేయించారని వాటిలో లోపాలున్నాయని చెప్పుకోవడం ప్రారంభించారు.
నిజానికి ఇవన్నీ మానవ తప్పిదాలే. విమానాల విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తత చూపిస్తారు. ఏ చిన్న లోపం ఉండటానికి అనుమతించరు. కానీ చేసే పనుల్లో జడత్వం వస్తే ఎంత సిబ్బందికైనా.. రోజు చెక్ చేసేదే కదా.. ఈ రోజు చెక్ చేయకపోతే ఏమవుతుందని అనుకోవడమో.. చెక్ చేసినట్లుగా నటించడమో చేస్తే చిన్న చిన్న లోపాలే పెను ప్రమాదాలు అవుతాయి. చిన్నదే కదా రేపు అయినా సర్దుబాటు చేసుకోవచ్చు అనుకుంటే.. మొదటికే మోసం వస్తుంది. అహ్మదాబాద్లో జరిగింది అలాంటిదేనని నిపుణులు చెబుతున్నారు.
విమానంలో సాంకేతిక లోపాలు … మొత్తం విమానం ఇంజిన్లను ప్రభావితం చేశాయంటే.. నిర్వహణ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదం వందల ప్రాణాలను తీసుకెళ్లింది. ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ. ఒక్కో జీవితం. వారి మీద ఆధారపడిన వారు ఎందరో. ఆ కథలన్నీ వింటే ఎవరికైనా కన్నీరు కారుస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే… ఏ విషయంలో అయినా.. “ ఆ.. ఏమవుతుందిలే” అన్న నిర్లక్ష్యం వదిలేసి.. అన్నీ సీరియస్గా తీసుకోవాలి.