మైనింగ్ డాన్ గాలి జనార్ధనా రెడ్డికి అదృష్టం కలసి వస్తోంది. ఎన్నో ఏళ్ల వాయిదాల తర్వాత విచారణ పూర్తి చేసి శిక్ష ఖరారు చేస్తే.. పై కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఆయనకు విధించిన శిక్షపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆయన విదేశాలకు వెళ్లకూడదని..పాస్ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. శిక్ష ఖరారయ్యే వరకూ ఆయన కండిషనల్ బెయిల్ పై ఉన్నారు. విదేశాలకు వెళ్లాల్సిన ప్రతీ సారి కోర్టు అనుమతి తీసుకునేవారు. పది లక్షలు చెప్పిన రెండు ష్యూరిటీలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.
తాను ప్రజా ప్రతినిధినని.. ప్రజలకు సేవ చేయాల్సి ఉందని గాలి జనార్దన్ రెడ్డి వాదించారు. తాను అక్రమ మైనింగ్ చేయలేదని ఆయన వాదించలేదు. తనపై ఎంతో మంది ఆధారపడి ఉన్నారని.. ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తర్వాత సుప్రీంకోర్టు ఆమెపై విచారణ జరపాలని ఆదేశించింది. ఆ విచారణ జరగాల్సి ఉంది. నిందితులందరికీ శిక్షపడినా ఆమె మాత్రం హైకోర్టు ఉపశమనంతో విచారణ నుంచి తప్పించుకున్నారు. మరోసారి ఆమె ప్రమేయంపై విచారణ జరగాల్సి ఉంది.
గాలి జనార్ధన్ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ఆయన .. కర్ణాటకలోని గంగావతికి ఎమ్మెల్యేగా అనర్హతకు గురయ్యారు. ఇప్పుడు శిక్షపై హైకోర్టు స్టే విధించడంతో అక్కడ ఉపఎన్నిక జరిగే అవకాశం లేదు. మళ్లీ ఆయనపై హైకోర్టు విచారణ జరిపి శిక్ష ఖరారు చేస్తే అనర్హతా వేటు పడుతుంది.. ఆయన మైనింగ్ చేసినట్లుగా సాక్ష్యాలు లేదనుకుంటే కేసు కొట్టేస్తారు. ఏది జరిగినా మళ్లీ ఇరు వర్గాలు సుప్రీంకోర్టుకు వెళ్తాయి. ఈ కేసు మరింత కాలం సాగడం ఖాయమని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.