తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వీరి సమావేశం కొనసాగుతోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ కార్యవర్గం , కార్పోరేషన్ చైర్మన్ల భర్తీపై కేసీ వేణుగోపాల్ తో రేవంత్ చర్చిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంతోపాటు కార్పోరేషన్ చైర్మన్ల నూ భర్తీ చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై వీరు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే , కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పూర్తిస్థాయిలో కార్పోరేషన్ చైర్మన్లను భర్తీ చేయకపోవడంపై నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక ఆలస్యం చేయవద్దని హైకమాండ్ కూడా భావిస్తోంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలలోపు కార్పోరేషన్ చైర్మన్లను ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత ప్రకటిస్తామని చెబితే ఎలా ఉంటుంది? అనే అంశాలపై సీరియస్ గా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. బీసీ కుల గణన , ఎస్సీ వర్గీకరణ చేయడంతో తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, హైకమాండ్ అప్పట్లో ఎన్నికల బిజీలో ఉండటంతో కుదరల్లేదు. దీంతో త్వరలోనే సభలు నిర్వహించాలని టీపీసీసీ భావిస్తోంది. అగ్రనేతలు ఈ సభలో పాల్గొనాలని రేవంత్ కోరనున్నట్లుగా తెలుస్తోంది.