నాగార్జున ఆక్రమణకు గురి అయినా ఎన్ కన్వెన్షన్ చెరువు భూమి రెండు ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధికి సహకరించి హీరో అయ్యాడని ప్రశంసించారు. కొండాపూర్ – ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సందర్భంలో రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నాగార్జునను హీరోగా ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా .. నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టేసింది. అయితే ఈ అంశంపై నాగార్జున ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయలేదు. న్యాయపోరాటం చేస్తామన్నారు.
అయితే ఆ తర్వాత అసలు ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. పైగా భూమిని ప్రభుత్వానికి అప్పగించేశారని తాజాగా రేవంత్ చేసిన ప్రకటనతో స్పష్టమైంది. అలా స్వాధీనం చేసుకున్నా నాగార్జున ప్రభుత్వంపై కానీ. . రేవంత్ పై కానీ ఎలాంటి వ్యతిరేకత పెంచుకోలేదు. రేవంత్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. మిస్ వరల్డ్ విందుల్లోనూ రేవంత్ తో కలిసి పాల్గొన్నారు.
నాగార్జున తెలివైన వ్యాపారవేత్త అన్న విషయం ఈ అంశంతో స్పష్టమయింది. ఎన్ కన్వెన్షన్ పై ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. అది చెరువు మధ్యలో ఉంటుందని అందరికీ తెలుసు. ఆ కన్వెన్షన్ గురించి తెలిసిన వారంతా నాగార్జున కబ్జా చేశాడని చెప్పుకుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న చెరువు స్థలం ప్రభుత్వానికి ఇచ్చేయడంతో ఆ మరక పోయినట్లవుతుంది. ప్రభుత్వంతో సున్నం లేకుండా..సీఎంతోనే హీరో అనిపించుకున్నారు.