కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంలోకి పోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. హైదరాబాద్ నుంచే పనులు చక్కబెడుతున్నారని సందర్భం కుదిరినప్పుడల్లా క్లాస్ పీకుతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే అంటున్నారు. ఎమ్మెల్యేల తీరు వల్లనే అసంతృప్తి వస్తుందన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యేలు తమను తప్పు పడుతున్నారు కానీ.. సమస్యలను పట్టించుకునేందుకు ఆసక్తి చూపించడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందంటే అది ప్రభుత్వం వల్ల లేకపోతే ఎమ్మెల్యేల వల్ల కాదు.. ఇరు వర్గాల వల్ల అవుతుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు “పవర్” సమస్య !
కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. తాము ఎమ్మెల్యేలమేనా కాదా అన్న డౌట్ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాల్లో చిన్న పనులు చేయడానికి కూడా కిందా మీదా పడాల్సి వస్తుంది. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం అన్నది గగనంగా మారింది. అదే సమయంలో క్యాడర్ కు పనులు చేయించలేకపోతున్నారు. వారికి పనులు ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలను ఎమ్మెల్యేలు తరుచూ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం దొరకడం లేదు. అది వారి సమస్య. కానీ పట్టించుకోవడంలేదు.
పథకాల అమలులో ప్రణాళికా లోపం
కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పథకాలు అమలు చేశామని చెబుతోంది. వాటిని ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని అంటున్నారు. కానీఈ పథకాల అమలులో ప్రజా ప్రతినిధులకు ఎంత మేరకు పాత్ర ఇచ్చారన్నది అర్థం కాని విషయం. రెండు లక్షల రుణమాఫీ చేసినప్పుడు ఎమ్మెల్యేల ద్వారానే అంతా చేయించాల్సింది. వారేం చేయకపోయినా ముందుగా ప్రచారం చేసుకునే కార్యక్రమాలను అయినా చేపట్టాల్సింది. అదొక్కటే కాదు.. అన్ని పథకాల అమల్లోనూ ఇలాంటివే కనిపిస్తున్నాయి. వారు కూడా కొంత మంది క్యాడర్ కు పథకాలు అందించలేకపోతూండటంతో అరకొరగా ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తప్పు ఎమ్మెల్యేలదే కాదు.. ప్రభుత్వ పెద్దలది కూడా !
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం అంటే.. కేవలం వారి వ్యవహారశైలితో మాత్రమే కాదు.. ప్రభుత్వం నుంచి వారికి సహకారం లేదని కూడా అనుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ ఇదే అభిప్రాయం ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత వరకు వర్కవుట్లు అయితే.. అంతగా ఎమ్మెల్యేలపై పాజిటివ్ పెరుగుతుంది. అంతిమంగా అది పార్టీకే మేలు చేస్తుంది. రెండు వర్గాలు ఇప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన సమయం ఇది.