ఎడిటర్స్ కామెంట్ : షిక్కటి చీకటి పాలన !

ప్రభుత్వం ఏం చేయాలి ?. ఏం చేసినా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి . తాము ఏం చేస్తున్నామో వారికి చెప్పాలి. అది కనీస బాధ్యత. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని.. అంతే కానీ.. సొంత కంపెనీలా ప్రభుత్వాన్ని నడుపుకోమని కాదు. ప్రభుత్వం ముఖ్య విధి.. పారదర్శకత. ఏం చేసినా.. ఏం చేయకపోయినా ప్రజలకు చెప్పాలి. ముఖ్యంగా ప్రజా సంబంధిత అంశాల్లో వారికి స్పష్టత ఇవ్వాలి. లేకపోతే అది చీకటి పాలనే అవుతుంది. ఈ చీకటి పాలనకు అచ్చమైన ప్రతి రూపం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఎం చేయబోతుందో ఎవరికీ తెలియదు. చేసేసిన ఆరు నెలల తర్వాత కూడా అది జరిగిపోయిందన్న విషయం తెలియదు. ఎప్పుడో జీవోను కావాలని బయట పెడితే తప్ప.. అహో అలా జరిగిపోయిందా అని ప్రజలకు క్లారిటీ ఉండదు.

ప్రజలకు తెలిస్తే ఎక్కడ ఆగ్రహిస్తారోనని జీవోలన్నీ దాచి పెట్టుకునే సర్కార్!

నవంబర్ మూడో వారంలో తెలంగాణ ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీని శ్రీవారికి భక్తులు సమర్పించే కానులతో నడిచే ఎస్వీబీసీ భక్తి చానల్‌కు సలహాదారుగా నియమించిన జీవో వెలుగు చూసింది. ఆ ఉత్తర్వులు ఇచ్చింది మార్చిలో అన్నట్లుగా.. తేదీ ఉంది. అంటే.. మార్చి నుంచి ఆ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ… ఉత్తర్వుల్లో చెప్పినట్లుగా నెలకు రూ. లక్ష తీసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంత రహస్యం ? . ప్రజలకు ఎందుకు తెలియకూడదు ? శ్రీవారి భక్తులకు ఎందుకు తెలియకూడదు ? .. ఇది మచ్చుకు ఒక్కటి మాత్రమే. అసలు పరిపాలనే చీకట్లో జరుగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన జీవోలేవీ పబ్లిక్ డోమైన్‌లోకి రావడం లేదు. ఇటీవల ప్రభుత్వం నుంచి ఓ జీవో లీక్ అయింది. లీక్ అయిందో తర్వాత బయటకు తెలిస్తే.. విశాఖను తాకట్టు పెట్టేసి బయటకు చెప్పలేదని లీక్ చేశారో కానీ.. ఆ జీవోలో విషయాలు మాత్రం అందర్నీ నిర్ఘాంతపరిచేలా ఉన్నాయి. విశాఖలోని పలు ప్రభుత్వ ఆస్తులను .. వంద ఎకరాలకుపైగా అతి విలువైన భూమిని ప్రభుత్వం ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్‌కు బదలాయించి తాకట్టు పెట్టేసిన వైనం వెలుగు చూసిన జీవోలో ఉంది. ఆ జీవోలో ఏ భూమి బదలాయించారో మాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఏ భూములు తాకట్టు పెట్టారో వివరాలు తెలియకుండా బ్లర్ అయ్యేలా ప్రింట్ తీసి రిలీజ్ చేశారు. ఇలాంటి తెలివితేటలు ప్రభుత్వం దగ్గర చాలా ఉన్నాయి. అందుకే.. అసలు ఏపీలో ఏ ఏ ఆస్తుల్ని ఎంత మేర తాకట్టు పెట్టారు.. ఏది అమ్మారు అన్నదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం చాలా కాలంగా జీవోలను బయట పెట్టడం లేదు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. మాన్యువల్‌గా జీవోలు జారీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. అయితే రాజ్యాంగపరంగా.. జీవోలను సీక్రెట్‌గా ఉంచకూడదు. కానీ ఉంచుతున్నారు. కోర్టుల్లో పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు ఒకటి.. రెండు మాత్రం గెజిట్‌లో పెడుతున్నారు. జీవోలు బయటకు వస్తే.. అవి చట్ట విరుద్ధమని ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది. అలా చాన్స్ ఇవ్వకుండా రహస్యంగా ఉంచుతున్నారు. అలాగే.. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలకు తెలిసిపోతుంది. అందుకే సీక్రెట్‌గా ఉంచుతారు.

ఎన్నెన్ని ప్రజాఆస్తులు తెగనమ్మారో.. తాకట్టు పెట్టారో తెలియని దుస్థితి !

ప్రభుత్వం చీకటి పాలనకు నిదర్శనం… అర్థరాత్రి జీవోలే. ఏపీ ప్రభుత్వంలో అర్థరాత్రి జీవోలు జారీ అవుతాయి. బయట పెట్టకపోయినా అంతే. ప్రజల్ని .. రాష్ట్రాన్నిపరిపాలిస్తున్నారో.. సొంత వ్యవస్థను నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని ఉన్నతాధికారులే విసుక్కునే పరిస్థితి ఉంది. తాజాగా … పంచాయతీరాజ్ శాఖ ఈఎన్‌సీ పదవిని ఓ అధికారి రిటైరయ్యారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న బాలునాయక్ ఈఎన్‌సీ అవ్వాలి. కానీ సుబ్బారెడ్డి అనే కింది స్థాయి అధికారి నేరుగా ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి మాట్లాడుకున్నారు. తనకే ఆ పదవిని తెచ్చుకున్నారు. వచ్చి బాధ్యతలు తీసేసుకున్నారు. ఆ జీవోను మాత్రం పబ్లిక్ డోమైన్‌లో పెట్టలేదు. ఎందుకంటే దాన్ని తీసుకుని అన్యాయమైపోయిన కింది అధికారులు కోర్టుకెళ్తారు. అంటే అన్యాయం చేయడమే కాదు… న్యాయం కోసం ప్రయత్నించకుండా అడ్డుకోవడం అంటే. ఇలా చేస్తుంది.. ప్రభుత్వమే అయితే.. ఇక అన్యాయమైపోయే వాళ్లు ఎవరికి చెప్పుకోవాలి ? అక్రమార్కులతే రాజ్యం అయినప్పుడు.. నీతి, నీజాయితీగా ఉండే వాళ్లు నేరస్తులు.. బాధితులు అవుతారు. ఇప్పుడదే ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది.

అంతా మునుగులో వ్యవహారాలు – తప్పుదోవ పట్టించేలా అబద్దపు పాలన !

పారదర్శక పాలన.. సీక్రెట్ జీవోల సంగతి పక్కన పెడితే.. అసలు ప్రజల్ని ప్రభావితం చేసే ఏ అంశంలోనూ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందా ? వారికి చెప్పాల్సినవి చెబుతోందా ? తెలియాల్సినవి తెలియచెబుతోందా ? అంటే… ప్చ్ అని నిరాశపడక తప్పదు. అసలు మూడు రాజధానులు అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసింది. ప్రజల ఆదాయాల్ని పడిపోయేలా చేసింది. పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు. ఉపాధి లేదు. ఏపీ నుంచి వలసలు పెరిగిపోయాయి. ప్రజల్ని ఇంతగా ప్రభావితం చేసిన అంశంలో ప్రభుత్వం.. ఏమైనా నిజాలు.. ప్రజలకు చెబుతుందా అంటే స్పష్టత లేదు. విశాఖలో రుషికొండ మీద సీఎం క్యాంఫీస్ కట్టుకుంటున్నారు. కానీ ఆ విషయం ప్రజలకు చెప్పారా ? . అదో టూరిజం హోటల్ అని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు… అవును క్యాంఫీస్ పెడితే తప్పేంటి అని మంత్రి బొత్స లాంటి వాళ్లు వితండ వాదం చేస్తున్నారు.. ఇలాంటి మంత్రులకు ఏం సమాధానం చెబుతాం ? తప్పా.. తప్పున్నర అన్నది కాదు సమస్య.. ప్రజల వద్ద ఎందుకు దాపరికం.. అవును.. సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నామని ప్రజలకు ఎందుకు చెప్పి చేయరు ? అంత కీలక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రజలకు చెప్పకుండా చేయడానికి ప్రభుత్వానికి ఏం అర్హత ఉంటుంది . ప్రతీ విషయం ప్రజలకు చెప్పి.. అనుమతి తీసుకుని చేయలేమని.. మంత్రులు వాదిస్తారు. అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.. కనీసం ప్రజలకు ఆ విషయం తెలిస్తే… వారి స్పందనేమిటో తెలియచేస్తారు. క్యాంప్ ఆఫీస్ అనేది.. ఓ టాపిక్ మాత్రమే కాదు… పరిపాలనలో ప్రతీ సీక్రెట్టే. ఉద్యోగుల పీఆర్సీ ప్రయోజనాల దగ్గర్నుంచి… వారి జీతాల వరకూ దేనిలోనూ పారదర్శకత ఉండదు. ఇలాంటి పరిపాలన చేయమనా ప్రజలు అధికారం ఇచ్చింది.

అన్ని అంశాల్లోనూ ప్రజల్ని మోసం చేసి ఏం సాధిస్తారు ? ఏం బావుకుంటారు ?

ప్రభుత్వ విశ్వసనీయతను పడుకోబెట్టేసి.. ఏం సాధించారో ప్రభుత్వానికే తెలియాలి. ఈ ప్రభుత్వం చెప్పిందేదీ చేయదన్న నమ్మకం ప్రజల్లో బలపడిపోయింది. తమకు ఏది ఉపయోగమో అదే చేస్తారని అందరూ నమ్ముతున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం ఎంత దారుణంగా పడిపోయిందో చెప్పడానికి కోర్టుల్లో దాఖలవుతున్న కోర్టు ధిక్కరణ పిటిషన్లే సాక్ష్యం. కొన్ని వేల కోర్టు ధిక్కరణ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఇవన్నీ న్యాయంకోసం వచ్చినవి కావు. న్యాయం చేయమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే.. ఆ న్యాయం చేయకపోతే.. పట్టించుకోలేదని కోర్టుకు వచ్చిన పిటిషన్లు. మరి న్యాయంచేయమని వచ్చిన పిటిషన్లు ఇంకెన్ని ఉంటాయి ?, కోర్టుకెళ్తే… ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్న దేశంలో అంతిమ ఆప్షన్‌గానే ప్రజలు కోర్టును ఎంచుకుంటారు . అదీ ప్రభుత్వంపై పోరాటం అంటే.. అసలు సిద్ధపడరు. కానీ ఈ ప్రభుత్వంతో ఇక ఏమీ కాదని.. తమకు న్యాయపోరాటమే దిక్కని వేలు.. లక్షల మంది న్యాయపోరాటానికి వస్తున్నారు. ఓ ప్రభుత్వంపై ప్రజలు ఈ స్థాయిలో న్యాయపోరాటం చేస్తున్న వైనం చరిత్రలో ఎక్కడా లేదు. ఇక ముందు ఉండదు కూడా. ఎందుకంటే వచ్చే ఏ ప్రజాపాలకుడైనా.. ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఎవరూ అనుకోలేరు.

ప్రభుత్వాన్ని నమ్మి బాగుపడినవాడు ఒక్కడైనా ఉన్నాడా ? ఈ చీకటి పాలన ఎవరి కోసం ?

ప్రభుత్వాన్ని నమ్మిన వారిని కూడా నట్టేటముంచారు. సర్పంచ్‌ల నిధుల కోసం రోడ్డెక్కుతారు. స్థానిక సంస్థల ప్రతినిధులు.. ఇదేం రాజకీయం అని ఈసడించుకుంటారు. మళ్లీ వీళ్లంతా ఎవరో పరాయి పార్టీలకు చెందిన వారు కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందినవారే. ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని.. అటు కుప్పుం నుంచి ఇటు సిక్కోలు వరకూ అందరూ… ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసేవారే. వారి బాధ వారిది. ఇక ప్రభుత్వం కోసం పనులు చేసిన వైసీపీ నేతల బాధ మరొకటి. బిల్లులు రాక.. కొద్ది మంది ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు కూడా వచ్చాయి. అంటే.. సొంతం పార్టీల నేతలకూ నమ్మకం కలిగించలేని పాలన.. విశ్వసనీయత లేని పాలన ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. ఇంకా ఏమైనా అంటే సొంత పార్టీ నేతల్నీ బెదిరించడం కూడా ఈ పాలనలో విచిత్రం. ఇలాంటి పాలన చేసి ఏం బావుకుందామని అనుకుంటున్నారు.

న్యాయవ్యవస్థతోనూ దాగుడుమూతలే – ఇంకెందుకీ అధికారం !?

చివరికి సుప్రీంకోర్టుతోనూ ఆటలే ఆడుతున్నారు. రాజధాని విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి.. వైసీపీ నేతలు చేస్తున్నప్రచారం ఏంటి? ప్రభుత్వం అంటే సొంత రాజ్యాంగం రాసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు రైతులతో ఒప్పందం గురించిచాలా స్పష్టంగా చెప్పింది. తీర్పులోనూ చెప్పింది. రాజధాని కోసం రైతుల వద్ద నుంచి సేకరించిన భూమిని ఇతరులకు ఇవ్వవొద్దని స్పష్టం చేసింది . కానీ ఇదే ముఖ్యమంత్రి మదనపల్లి సభలో.. పేదలకు ఇళ్ల స్థలాలిస్తూంటే.. వద్దంటున్నారని వ్యాఖ్యానించారు. అంటే ఆయన సుప్రీంకోర్టునూ లెక్క చేయడం లేదని అర్థం. ఇప్పుడే కాదు మొదటి నుంచి ఆయన తీరు అంతే . సీఎం పదవి అంటే.. ఏమైనా చేయవచ్చని… అనుకుంటున్నారు. ఆ పదవి తనకు రాజ్యాంగం ఇచ్చిందని.. ఆ రాజ్యాంగం ప్రకారమే తాను పని చేయాలని అనుకోవడం లేదు.

ఎన్నుకున్నది ప్రజలు అనే కనీస ఇంగిత జ్ఞానాన్ని పాలకులు మర్చిపోయారు. ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు.. చెడు చేయకూడదనే అభిప్రాయాన్నీ చెరిపేశారు. కొంత మందికి చెడు చేసి… ఇతరులకు అదే మంచి అని చూపించే క్రమంలో.. ఉచ్చనీఛాలు మరిపోయి పాలన చేస్తున్నారు. ఈ క్రమంలో అందరూ నష్టపోతున్నారు. రాష్ట్రం ఇప్పటికే నాశనం అయిపోయింది. మరో ముప్ఫై ఏళ్లు ప్రజలు పన్నులుగా కట్టాల్సిన సొమ్మును తాకట్టు పెట్టి అప్పులు తేచ్చి ఖర్చు చేసేశారు. ఆదాయం వచ్చే మార్గం తగ్గిపోయింది. ఇంత చేసి పాలకులు ఏం బావుకున్నారు ? అందరూ పేదలైపోయి…. తాము మాత్రం పాలకులుగా ఉండి ఏం సాధించాలనుకుంటారు ? ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంత దారుణంగా దుర్వినియోగం చేసి కూడగట్టుకున్నదేంటి ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close