టిల్లు సినిమాతో స్టార్ బోయ్ అయిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ కూడా తెగ ఆడేసింది. దాంతో తన ఇమేజ్ డబుల్ అయ్యింది. అయితే ఆ తరవాత వచ్చిన ‘జాక్’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాతో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బాగా నష్టపోయారు. ఇప్పుడు ఆ నష్టాన్ని కాస్తలో కాస్త భర్తీ చేసేందుకు ముందుకొచ్చాడు టిల్లు. తన పారితోషికం నుంచి రూ.4 కోట్లు వెనక్కి ఇచ్చేశాడు. ఈ సినిమా కోసం మొత్తంగా రూ.8 కోట్లు అందుకొన్నాడు సిద్దు. అందులో సగం రిటర్న్ ఇచ్చాడన్నమాట. నిజంగా ఇది మంచి విషయం. నిర్మాత నష్టపోయినప్పుడు హీరోలు పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని, వాళ్లని ఆదుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంటుంది. కానీ అలా చేసే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు టిల్లు అదే పని చేశాడు. నిజానికి హీరోలు పారితోషికాలు తిరిగి ఇవ్వరు. ”కావాలంటే మరో సినిమా చేస్తా” అని చెబుతుంటారు. కానీ అలా నిర్మాతని ఆదుకోవడానికి చేసిన సినిమాలు కూడా చాలా వరకూ వర్కవుట్ అవ్వవు. అప్పుడు నిర్మాత మళ్లీ అప్పుల పాలవుతాడు. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగా నిర్మాతని గట్టెక్కించడానికి ఇలా వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సిద్దుని అభినందించాల్సిందే.
ప్రస్తుతం సిద్దు ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శర వేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. నీరజ కోన దర్శకురాలు. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.