వైసీపీ ప్రాధాన్యాలు ఎలా ఉంటాయో .. ఉపరాష్ట్రపతికి ఈ రోజు వారు చేసిన ఫిర్యాదులను బట్టి తెలిసిపోతుంది. నారా లోకేష్ రాజ్యసభ గ్యాలరీలో ఉన్నారని… ఆయన అలా కూర్చున్నారని లైవ్ లో చూపించారని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉపరాష్ట్రపతి కమ్ రాజ్యసభ చైర్మన్ అయిన సీపీ రాధాకృష్ణన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అలా గ్యాలరీలో కూర్చున్న వారిని చూపించే సంప్రదాయం గతంలో లేదని అన్నారు. అంతే కాకుండా.. లోకేష్ గ్యాలరీలో కూర్చున్న ఫోటోలు అన్ని పేపర్లలో వచ్చాయన్నారు. అసలు వైవీ సుబ్బారెడ్డి సమస్య ఏమిటో .. లోకేష్ ను చూపిస్తే ఆయనకు వచ్చిన ఇబ్బందేమిటో .. ఎవరికీ అర్థం కాలేదు.
నారా లోకేష్ అమరావతి బిల్లు పాస్ అవుతున్న చారిత్రక సందర్భంలో రాజ్యసభలో ఉండాలని వెళ్లారు. గ్యాలరీపాస్ తీసుకుని వెళ్లి చూశారు. అక్కడ కూర్చున్న వారిని చూపించకూడదన్న రూల్ ఎక్కడా లేదు. కానీ చూపించారని ఆయన ఫీలయిపోతున్నారు. నేరుగా ఉపరాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. లోకేష్ కు వస్తున్న ప్రచారం చూసి .. లభిస్తున్న ప్రాధాన్యత చూసి సుబ్బారెడ్డి ఫీలయినట్లుగా ఉన్నారు. ఆయన ఫీల్ కావడానికేమీ ఉండదు కానీ.. జగన్ రెడ్డి ఫీల్ అయి ఉంటారు కాబట్టి ఈ రియాక్షన్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
అదే సమయంలో తమకు తక్కువ సమయం ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన తాను చెప్పాలనుకున్నది చెప్పి వాకౌట్ చేశారు. ఎక్కువ సమయం ఇచ్చి ఏం ప్రయోజనం ఉంటుంది. ఇతరులకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సేపే మాట్లాడినా అనుమతి ఇచ్చారు. సుబ్బారెడ్డి దగ్గర మాట్లాడేందుకు సరుకు లేక.. ఏం మాట్లాడాలో తెలియక ఆయన వాకౌట్ చేశారు. ఇప్పుడు తక్కువ సమయం ఇచ్చారని అంటున్నారు.


