‘థగ్ లైఫ్’ విడుదలకు కర్ణాటకలో అనుమతి ఇవ్వాలని దాఖలు అయిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ కర్ణాటక సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. మహేష్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
కమల్ హసన్ నటించిన ‘థగ్ లైఫ్’ కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి అనుమతి లభించినా కర్ణాటకలో మాత్రం విడుదలకు ఆటంకాలు ఏర్పడ్డాయని పిటిషనర్ పేర్కొన్నారు. బెదిరింపులు, పోలీసుల జోక్యంతో ఈ సినిమా విడుదల కాలేదని, ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే సినిమా ప్రదర్శనను నిలిపివేశారన్నారు.
సినిమా విడుదలను అడ్డుకుంటామని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారని, ఇది ఆర్టికల్ 19(1)(ఏ) కింద వాక్ స్వాతంత్య్రం, ఆర్టికల్ 19(1)(జీ) కింద వృత్తిని ఆచరించే హక్కును ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. బెదిరింపులకు తలొగ్గి, సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడం అంటే రాజ్యాంగ వైఫల్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ‘థగ్ లైఫ్’ పై అనధికారిక నిషేధాన్ని రద్దు చేసి, థియేటర్లలో ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్’ సినిమా ఈవెంట్లో కమల్ హాసన్ పాల్గొని… కన్నడ నటుడు శివరాజ్కుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ… మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే ‘థగ్ లైఫ్’ సినిమాను అడ్డుకుంటామని కన్నడవాసులు ప్రకటించారు. అయినా కమల్ హసన్ వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ సినిమా విడుదలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.