ఏపీ అసెంబ్లీ సమావేశాలలో వరుసగా మూడవ రోజు కూడా వైకాపా ఆందోళనలతో స్తంభింపజేస్తోంది. సాగునీరు, రైతుల ఆత్మహత్యలపై చర్చించేందుకు వైకాపా ఇచ్చిన సావధాన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేప్పట్టడంతో వైకాపా సభ్యులు వై.యస్సార్ ఫోటోలతో ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అసెంబ్లీ హాలు నుండి వై.యస్స్ చిత్రపటాన్నితొలగించినందుకు నిరసనలు తెలియజేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సభను 10 నిమిషాలు వాయిదా వేసి తిరిగి ప్రారంభించిన తరువాత కూడా వైకాపా సభ్యులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కేవలం ఐదు రోజులు మాత్రమే సాగే శాసనసభ సమావేశాలలో ప్రజాసమస్యలపై ఎటువంటి చర్చ జరపకుండా అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, వాగ్వాదాలు చేసుకోవడం చాలా విచారకరం. శాసనసభలో ఎదుటి పక్షం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును టీవీ చానెళ్ళ ద్వారా ప్రజలు గమనించాలని విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా శాసనసభను ఒక యుద్ధవేదికగా భావిస్తున్నాయి తప్ప అది ప్రజాసమస్యలపై చర్చించవలసిన వేదికగా భావించకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా తాము ప్రజా సమస్యలపై చర్చించాలనుకొంటుంటే అవతలవారు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ వ్యక్తిగత విమర్శలు, వాగ్వాదాలతో అమూల్యమయిన శాసనసభా సమయాన్ని వృదా చేస్తున్నారు.