తెలుగుదేశం పార్టీ మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించింది. చివరి రోజు ఐదు లక్షల మందితో బహిరంగసభ నిర్వహించింది. పార్టీకి బలం ఉందని చెప్పుకోవడానికి నిర్వహించే సభలకు.. ప్లీనరీ సభలకు తేడా ఉంటుంది. ఆ తేడా మహానాడులో స్పష్టంగా కనిపించింది. పార్టీపై అభిమానంతో తరలి వచ్చిన లక్షల మంది కార్యకర్తల జోష్ మహానాడులో కనిపించింది. వారి ఉత్సాహం దశాబ్దాలుగా అంతే ఉంది.. ఇంకా చెప్పాలంటే పెరుగుతోంది.
తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఇలాంటి జోష్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అనే పేరు మారుమోగిపోయేది. ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పాల్సిన పని లేదు. అప్పటి నుంచి మహానాడు ప్రతి రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎప్పుడూ ఇదంతా మామూలే కదా అనుకోలేదు. కృత్రిమంగా నిర్వహించలేదు. ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో నేతలు, కార్యకర్తలు ముందుకు సాగుతూ పోయారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా రెండు సార్లు మహానాడు నిర్వహించారు. ఒంగోలులో.. రాజమండ్రిలో. రెండు సార్లూ.. టీడీపీలో ఉత్సాహం నింపడానికి జగన్ సహకరించారు. బస్సులు ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సులే కాదు.. స్కూల్, కాలేజీ బస్సుల్ని ఉపయోగించుకోనివ్వలేదు. అయినా కార్యకర్తలు కార్రలో వచ్చారు..బైకులపై వచ్చారు.. చివరికి నడుచుకుంటూ వచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చేలా స్ఫూర్తి నిచ్చారు. ఇప్పుడు కూడా అదే ఉత్సాహం, పట్టుదల కనిపిస్తున్నాయి.
మనల్ని మనమే ఓడించుకుంటాం.. కానీ ఎవరూ ఓడించలేరని చంద్రబాబు ఇటీవల తమ క్యాడర్ తో చెబుతున్నారు. కోపం వస్తే ఇంట్లో పడుకుంటారు కానీ మరో పార్టీకి పని చేయరని అంటారు. అది వంద శాతం నిజం. ఆ విషయం ఈ మహానాడుతో మరోసారి నిరూపితమయింది. తెలుగువారి ప్రత్యేకమైన గుర్తింపుగా ఉన్న టీడీపీ మరో నలభై ఏళ్ల పాటు నిరాటంకంగా పయనం సాగిస్తూందని ఈ మహానాడు మరోసారి నిరూపితం చేసింది.