తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇప్పుడు ఏం చేస్తోందంటే.. ఎవరో ఊరు పేరు లేని వాళ్లు వాగిన వీడియోలను .. స్పేసుల్లో మాట్లాడిన మాటలను.. అందరికీ తెలిసేలా చేసి..వాళ్లపై కేసులు ఎందుకు పెట్టరని హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. రోడ్డు మీద పోయే కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి. అన్నింటినీ కరవాల్సిందే అన్నట్లుగా వీరి వ్యవహారం ఉండటంతో టీడీపీ హైకమాండ్ కూ ఇబ్బందికరంగా మారింది. వీరంతా ఈగోలకు పోయి అలాంటి వారికి ప్రాధాన్యం ఇచ్చి.. వాళ్లను హీరోలను చేయాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాస్త కూడా లౌక్యంగా వ్యవహరించడం లేదు.
స్పేసుల్లో ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు. బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అదో ప్రపంచం. వాళ్ల భ్రమల్లో వాళ్లు బతుకుతూంటారు. అక్కడ బూతులు తిట్టారని ఇక్కడ కేసులు పెట్టాలన్నట్లుగా వీరు ఉన్నారు. ఎవరో పంచాయతీ వార్డు కౌన్సిలర్ కు పోటీ చేయడానికి కూడా స్థాయి లేని వ్యక్తి.. ఫేమ్ కోసం అందర్నీ కించ పరుస్తూంటే ఆ వీడియోలను.. తమ వాల్ పై పోస్టు చేసుకుని కేసులు పెడతారా లేదా అని .. అడుగుతున్నారు. వీరి వ్యవహారశైలితో.. వారు అంటున్న మాటలను విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
కూటమిలో కార్యకర్తలు కూడా కలిసే పని చేసుకుంటున్నారు. పని లేని ఈ సోషల్ మీడియా కార్యకర్తలదే ఎక్కువ న్యూస్సెన్స్ జరుగుతోంది. ప్రతీ చిన్న విషయాన్ని .. చర్యలు తీసుకోలేదని మంచి ప్రభుత్వమని సెటైర్లు వేస్తున్నారు. వీరు .. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. అందుకే తాము ఏది చేసినా కరెక్టే అనుకుంటున్నారేమో కానీ చెలరేగిపోతున్నారు. వీరి వల్ల పార్టీకి.. కూటమికే నష్టం జరుగుతోంది. ఆ విషయాన్ని అంగీకరించడానికి వీరు సిద్ధంగా లేరు.