తెలంగాణ ఏసీబీ అధికారులు కేటీఆర్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. సోమవారం ఆయన విచారణకు హాజరైనప్పుడు ఫోన్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు అడిగారు. అయితే తాను విచారణకు వచ్చేటప్పడు ఫోన్ తీసుకు రాలేదని సమాధానం ఇచ్చారు. విచారణ నుంచి వెళ్లేటప్పుడు 2021 నుంచి 2023 వరకు వాడిన మొబైల్ ఫోన్స్ ను తీసుకుని స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఈనెల 18 లోపు ఇవ్వాలన్నారు.
కేటీఆర్ ఫోన్లు ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ వ్యక్తిగతంగా వాడిన ఫోన్లు అంటే.. అందులో కేవలం.. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వివరాలే కాదు..చాలా సీక్రెట్స్ ఉంటాయి. అవన్నీ వ్యక్తిగత వివరాల కిందకు వస్తాయి. కేటీఆర్ తన సీక్రెట్స్ అన్ని పోయి పోయి .. ఏసీబీ అధికారుల దగ్గర పెట్టే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా ఆయన ఇచ్చే అవకాశం ఉండదు.
ఫోన్లలో డేటాను మొత్తం తీసేసినా.. దాన్ని రీట్రీవ్ చేసే టెక్నాలజీ ఉంది. అందుకే పోలీసులు కేటీఆర్ ఫోన్ అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై కేటీఆర్ తన తరపు లాయర్లతో ఎలాంటి వ్యూహం ప్రకారం ముందడుగు వేయాలా అన్నదాన్ని చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ ఫోన్లు లేవని.. చెప్పడం లేదా.. వ్యక్తిగత సమాచారం కోసమే ఫోన్లు అడుగుతున్నారని చెప్పి కోర్టుకెళ్లడం వంటివి చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.