కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీని, దాని నేతల రాజకీయ భవిష్యత్ ని పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణాలో కూడా అధికారంలోకి రాలేకపోయింది. కారణాలు అందరికీ తెలిసినవే. ఆ తరువాత ఫిరాయింపుల కారణంగా పార్టీ చాలా బలహీనపడింది. కానీ తెరాస సర్కార్ చేస్తున్న తప్పిదాల పుణ్యామాని తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని సవాలు చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఈ విషయంలో భాజపా, తెదేపాల కంటే కూడా కాంగ్రెస్ పార్టీయే ముందున్నట్లు కనబడుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీలో అందరికీ చాలా సంతోషం కలిగించే విషయమే. ఇక ముందు కూడా నిలకడగా ఇదే జోరుతో తన పోరాటాలని కొనసాగించగలిగినట్లయితే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే తెరాసకి ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచి గట్టి పోటీ ఇవ్వగలదు.
తెరాస నిరంకుశ పాలన కారణంగా దానిపట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుండటం, రాష్ట్రంలో తెదేపా, భాజపాలు దూరం అవడం, ఆ రెండు పార్టీలు అనేక బలహీనతలతో సతమతం అవుతుండటం వంటి అనేక కారణాలు రాష్ట్రంలో రాజకీయ శ్యూన్యతని సృష్టించాయని చెప్పవచ్చు. కనుక ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకొని తెరాసకి ప్రత్యామ్న్యాయంగా ఎదగడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆ పార్టీ సికింద్రాబాద్ లోని కె.జె.ఆర్. గార్డెన్స్ లో నిన్నటి నుంచి మూడు రోజులు పార్టీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో పాల్గొన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తెరాస-భాజపాలని బాగానే ఎండగట్టారు.
“భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా రాష్ట్రానికి రూ.90,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. కానీ తెరాస నేతలు అందులో సగం కూడా ఇవ్వలేదని వాదిస్తున్నారు. వారిలో ఎవరి వాదన నమ్మాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఖర్చు చేస్తోంది? ప్రతిపక్ష పార్టీ నేతలని పార్టీలు ఫిరాయింపజేయడానికి ఖర్చు చేస్తోందా?” అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో కూడా తెరాస సర్కార్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. భూసేకరణ చట్టం అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం దాని ప్రకారం చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.
ఈ రెండు విషయాలలో కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్నలకి తెరాస సంతృప్తికరమైన సమాధానాలు చెప్పుకొనే పరిస్థితి కూడా లేదు. కేంద్రం నుంచి నిర్దిష్టమైన శాస్త్రీయమైన పద్దతిలోనే దేశంలో అన్ని రాష్ట్రాలకి నిధులు బదిలీ చేయబడుతుంటాయి. కనుక వాటిపై అన్ని కోట్లు తేడా రావడానికి, భిన్నాభిప్రాయాలకి అవకాశమే లేదు. కానీ తేడా ఉందని వాదించుకొంటున్నాయి అంటే అది రాజకీయాలు చేయడంగానైనా భావించాలి లేదా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా నిధులు పక్కదారి పడుతున్నా ఉండి ఉండాలి. ఇక భూసేకరణ విషయంలో కూడా తెరాస సర్కార్ ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా దాని వైఖరిలో మార్పు కనబడటం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ భూసేకరణ అంశాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తెరాస సర్కార్ పై పోరాడగలుగుతోంది. దానికి ఆ అవకాశం కల్పిస్తున్నది తెరాస సర్కారేనని చెప్పక తప్పదు. సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి, హామీలు అమలులో వైఫల్యం వంటి అనేక ఆయుధాలు కాంగ్రెస్ చేతికి చిక్కాయి. కనుక వాటితో, ఇక ముందు తెరాస సర్కార్ అందించబోయే కొత్త ఆయుధాలతో ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాలని ఇంకా ఉదృతం చేయవచ్చు. కనుక తెరాస కూడా దానిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేసుకోవడం మంచిది.