రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ.. సెంట్ భూముల్లో ఇళ్లను కడతామని చెప్పి డబ్బులను అడ్వాన్స్ గా తీసుకుని కట్టకుండా పారిపోయింది.ఈ విషయం ఎన్నికలకు ముందే అందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోయాక చర్యలు తీసుకుంటారని అనుకున్నారు. కానీ తోపుదుర్తి ప్రభుత్వంపై కుట్రలు చేస్తూనే ఉన్నారు కానీ చర్యలు మాత్రం ప్రారంభం కాలేదు. తాజాగా మరోసారి రాక్రీట్ సంస్థ రూ. 80 కోట్లు అడ్వాన్సులు తీసుకుని ఇళ్లు కట్టలేదని చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారధి ప్రకటించారు. అవి మాటలేనా.. నిజంగా చర్యలు ప్రారంభిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
2019 ఎన్నికలకు ముందు రాప్తాడు నుంచి వరుగా పోటీ చేస్తూ ఓడిపోతూ ఆస్తులన్నీ పోయాయని కన్నీరు పెట్టుకుని ఇంటింటికి పోయి బతిమాలుకుని ఓట్లు వేయించుకున్నారు తోపుదుర్తి. 2019లో గెలిచిన తోపుదుర్తి ఐదేళ్లలో ఎమ్మెల్యేగానే వందల కోట్ల ఆస్తి పరుడయ్యారు. ఆయన సంపాదించిన దాంట్లో కమిషన్లు… దందాతోనే కాకుండా.. రాక్రీట్ అనే కంపెనీ ద్వారానే ఎక్కువ సంపాదించారు.
రాక్రీట్ అనే కంపెనీని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెట్టారు. ఈ కంపెనీ సెంట్ స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం వద్ద అడ్వాన్సులు తీసుకుని పత్తా లేకుండా పోయింది. ఇలా కడతామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్న వాటిలో పులివెందుల ఇళ్లు కూడా ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఇలాంటి కాంట్రాక్టులు తీసుకుని ఇళ్లు కట్టకుండా బిల్లులు పిండుకుంది. కానీ అసలు ఇళ్లే పూర్తి చేయలేదు. కొన్ని ఇళ్లు గోడల వరకు.. అత్యధికం పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. ఒక్క ఇంటిని సైతం పూర్తి చేయలేదు కానీ బిల్లులు మాత్రం వందల కోట్లలో వసూలు చేసుకుంది. టెండరు ప్రక్రియ, ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు చేశారు. రాక్రీట్ ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. విజిలెన్స్ దర్యాప్తులో ఇవన్నీ బయటపడి చాలా కాలం అయింది.
కానీ ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. కనీసం దోచేసిన డబ్బుల్ని అయినా వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. లేకపోతే ఆ డబ్బులతోనే ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడటం ఖాయంగా కనిపిస్తోంది.