అల్లు అర్జున్తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్కి వెళ్ళింది. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో కథ రెడీ చేసుకొని బన్నీ డేట్స్ కోసం త్రివిక్రమ్ ఎదురు చూశారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్-బన్నీ అనౌన్స్మెంట్ వస్తుందని అనుకున్నారు. కానీ బన్నీ అట్లీ సినిమాకి వెళ్లిపోయాడు. బన్నీ-త్రివిక్రమ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఎంత బాండింగ్ ఉన్నా, ఇంత వెయిటింగ్లో పెట్టడం త్రివిక్రమ్కు సబబుగా అనిపించలేదు. దీంతో ఆ కథను ఎన్టీఆర్ వైపు తిప్పారు.
నిజానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. బన్నీతో మైథాలజికల్ కథ అనగానే ఎలా ఉంటుందో అనే ఒక ప్రశ్న అందరిలో వచ్చింది. ఇప్పుడు ఆ కథ ఎన్టీఆర్కి రావడంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. పౌరాణికాలు ఎన్టీఆర్కి బాగా నప్పుతాయి. యమదొంగలో కాసేపు యంగ్ యమాగా కనిపించినప్పుడు థియేటర్ దద్దరిల్లింది. ఆయన పూర్తి స్థాయి పౌరాణికం చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కథ చేరాల్సిన చోటికే చేరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, బన్నీని కాదని త్రివిక్రమ్ ఎన్టీఆర్తో వెళ్లడంపై కొంత నెగటివ్ ట్రోలింగ్ జరుగుతోంది. ఖలేజాతో ఫ్లాప్లో ఉన్న త్రివిక్రమ్కి బన్నీ ఛాన్స్ ఇచ్చాడని, ఆ మాత్రం వెయిట్ చేయలేరా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లలో కూడా లాజిక్ లేదు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్కు ఎవరితోనైనా సినిమా చేసే అవకాశం ఉంది. కానీ ఆ క్రేజ్ మొత్తాన్ని మళ్లీ బన్నీతో చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకే వాడారు.
క్రియేటర్కి హీరో ఎంత అవసరమో, హీరోకి క్రియేటర్ కూడా అంతే అవసరం. అట్లీ సినిమా తర్వాత ఖచ్చితంగా బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి వస్తారా? అంటే గ్యారంటీ లేదు. ఆ సినిమా రిజల్ట్ను బట్టి మళ్లీ తన హిట్ సిరీస్ పుష్పలోకి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ తన ప్లానింగ్లో మార్పులు చేసుకున్నారని వినిపిస్తోంది.