ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేశామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పుకున్నారు. వాటిపై బాంబులు తమ యుద్ధ విమానాలు సేఫ్గా చేరుకున్నాయని కూడా ఆయన ప్రకటించుకున్నారు. ట్రంప్ ప్రకటనపై ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఇరాన్ పై దాడులకు ఆయన సిద్ధమయ్యారని వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది నిజం అయింది. అయితే దీని వల్ల సమస్య పరిష్కారం అవదు సరి కదా.. యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్ ను బెదిరించి దారికి తెచ్చుకోవాలి.. అణు ఒప్పందం చేయించుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందు కోసం మొదట.. ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టారు. ఆ దేశం ఇరాన్ పై దాడులు చేసింది. ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది. కానీ ఇరాన్ భయపడలేదు. ఇరాన్ సుప్రీంలీడర్ ను ఖతం చేస్తామని .. అలా చేస్తే శాంతి నెలకొంటుందని రెండు దేశాలు ప్రకటిస్తున్నాయి. కానీ ఓ దేశ సుప్రీం లీడర్ ను అంత ఈజీగా చంపేయడం సాధ్యమవదు. చంపగానే పని అయిపోదు.. ఆ తర్వాత జరిగే పరిణామాలనూ ఎదుర్కోవాల్సిన ఉంటుంది.
ప్రపచంంలో ప్రతి దేశానికీ తమదైన శక్తి ఉంటుంది. తమ ప్రయోజనాలను తాము కాపాడుకోవాలని .. ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇరాన్ శక్తి ఇరాన్ కు ఉంటుంది. ఇరాన్ మంచిదా.. చెడ్డదా అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీఇలా ప్రతీ దానికి యుద్ధం చేయడం.. మనుషుల్ని చంపడం అనేది సరైన పరిష్కారం కాదని ఎక్కువ మంది నమ్ముతారు. యుద్ధం అంటే విధ్వంసం.. నాశనం తప్ప ఇంకేమీ ఉండదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలూ శాంతంగా లేరు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇరాన్ ప్రజలూ అంతే. రేపట్నుంచి అమెరికన్లు కూడా అలాగే బతకాల్సి రావొచ్చు.
ట్రంప్ .. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటడపడుతున్నారు. కానీ ఆయన తీరు వల్ల మొత్తం ప్రపంచమే రిస్క్ లో పడుతోంది. ఆయన విధానాలతోనే ఇప్పుడీ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.