విజయ్ మాల్యాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. వివిధ బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న ఆరేడు వేల కోట్ల అప్పులకు సంబంధించి పధ్నాలుగు వేల కోట్ల ఆస్తులను వేలం వేసుకున్నారని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పారు. మరి నేను ఎందుకు దొంగనవుతా అని మాల్యా ప్రశ్నిస్తున్నారు. ఇదేదో లాజికల్ గా ఉండటంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఈ కారణంగా కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మాల్యా..అసలు కట్టాడు కానీ..వడ్డీలు, జరిమానాలు, ఇతర చార్జీలు కట్టలేదని వాటికి సంబంధించి ఇంకా బాకీ ఉందని ప్రకటించింది.
ఏప్రిల్ 10, 2025 నాటికి మొత్తం విజయ్ మాల్యా బకాయిలు రూ. 17,781 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో కింగ్ఫిషర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ , ఇతర చట్టబద్ధ బకాయిలు కూడా కలిపి ఉన్నాయి. 2013 కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చేతులెత్తేసినప్పుడు మొత్తం అప్పు రూ. 6,848 కోట్లు. వీటికి వడ్డీ, జరిమానా, ఇతర చార్జీలు రూ. 10,933 కోట్లు అయ్యాయి. అంటే తీసుకున్న అప్పు కన్నా రెండింతలు ఎక్కువ వడ్డీ, ఇతర ఖర్చులు అయ్యాయి. విజయ్ మాల్యా నుంచి బ్యాంకులు రూ. 10,815 కోట్లు వసూలు చేశాయి. అంటే ఇంకా ఇంకా రూ. 6,967 కోట్లు వసూలు కావాల్సి ఉందని కేంద్రం ప్రకటించారు.
అయితే మాల్యా ఆస్తులన్నీ వడ్డీలకు.. జరిమానాలకు సరిపోయింది. ఇప్పుడు ఆయన అసలు కన్నా ఎక్కువ కట్టాల్సి ఉందన్నమాట. అందుకే ఆయనను రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. మాల్యా పరిస్థితి..సగటు క్రెడిట్ కార్డు డిఫాల్టర్ లాగా మారింది. ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే బిల్లు ఊహించనంతగా పెరుగుతుంది. చివరికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోమని ఆఫర్ ఇస్తారు. మరి మాల్యాకు అలాంటి ఆఫర్ ఇస్తారో లేదో ?