ప్యాలెస్లో కాదు ప్రజల్లోకి వచ్చి కాస్త ప్రజాభిప్రాయం వినండి .. అని జగన్ రెడ్డికి విజయసాయిరెడ్డి చెప్పారు. కోటరీని నమ్ముకోవద్దు.. కోట నుంచి బయటకు వచ్చి ప్రజల ఫీడ్ బ్యాక్ తెలుసుకోండిఅని సలహాలు ఇచ్చారు. అయితే ఆ విజయసాయిరెడ్డి చంద్రబాబుతో చేయి కలిపి ఇలాంటి సలహాలు ఇస్తున్నారని జగన్ ఫీలయ్యారు. అందుకే ఆయన తనతో ఎలా ప్రయాణించారన్నది మర్చిపోయి ప్రెస్మీట్లో సులువుగా నింద వేసేశారు. ఇప్పుడు జగన్ రెడ్డికి దూరం జరిగినప్పుడు విజయసాయిరెడ్డి కూడా హ్యాపీ ఫీలవుతూంటారు. ఇంకా చెప్పాలంటే జగన్ రెడ్డి, వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఆయన పగలబడి నవ్వుకుని ఉంటారు.
వైసీపీని సంఘ విద్రోహశక్తిగా మారుతున్న సలహాదారులు
వైసీపీని ఓ సంఘ విద్రోహశక్తిగా మార్చేలా ఇప్పుడు సలహాదారులు జగన్ రెడ్డిని నడిపిస్తున్నారు. రౌడీషీటర్లకు మద్దతు తెలియచేయడంతోనే .. ఆ పార్టీ తన ఓటు బ్యాంకును కూడా రిస్క్ లో పెట్టుకుంది. ఇప్పుడు అమరావతి మహిళలపై ఏకపక్షంగా ముద్ర వేసే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ఇప్పటి వరకూ సాక్షి మీడియా నుంచి క్షమాపణ రాకపోగా.. సమర్థింపులు పెరిగిపోతున్నాయి. టీడీపీ వాళ్లు అలా అన్నారని .. జగన్ రెడ్డి ట్వీట్లు పెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంతో వైసీపీ నేతలు జుగుప్సాకారంగా గతంలో చేసిన వ్యాఖ్యలు అన్నీ వైరల్ అవుతున్నాయి.
విజయసాయిరెడ్డి ప్లేస్ ను సజ్జల కొట్టేసినప్పటి నుంచే సమస్యలు
వైసీపీకి అతి పెద్ద సమస్య రాజకీయాల్ని అర్థం చేసుకోలేకపోవడం. బూతులు తిట్టి రాజకీయాలు చేయాలనుకోవడం. ఇలా ఎందుకు చేస్తారో కానీ.. గతంలో రాజకీయాలు చేసేవారు. విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాల్ని చూసుకున్నంత కాలం ఆ పార్టీ పరిస్థితి బాగానే ఉండేది. 2019లో వైసీపీ విజయంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. ఆ విషయం పార్టీ ముఖ్యులందరికీ తెలుసు. కానీ 2024 పరాజయంలో పాత్ర ఎవరిది.. విజయసాయిరెడ్డి ప్లేస్ ను కొట్టేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మాత్రం నీటుగా ఉంటూ అందర్నీ బూతు రాయుళ్లను చేశారు. పార్టీని భ్రష్టుపట్టించారు.
బయటకు వచ్చేసినందుకు విజయసాయిరెడ్డి ఫుల్ హ్యాపీ
ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీ దుస్థితి చూసి పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. కోటరి జగన్ రెడ్డిని, ఆ పార్టీని ఖచ్చితంగా దివాలా తీయిస్తుందని ఆయనకు బాగా తెలుసు. ముందుగానే ఆయన తప్పించుకున్నారు. తన లాంటి ఓ లాయర్ లీడర్ ను కించ పరచి బయటకు వెళ్లిపోయేలా చేసిన జగన్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందని ఆయన అనుకుంటూ ఉంటారు. సజ్జలను నెత్తి మీద పెట్టుకున్నంత కాలం.. జగన్ రెడ్డికి దరిద్రం వదలదని వైసీపీనే అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.