వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంత మంది నిందితుల బెయిల్స్ రద్దు చేయాలో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని కూడా సీబీఐకి నిర్దేశించింది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని వారి బెయిల్స్ రద్దు చేయాలని వైఎస్ సునీతతో పాటు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు .. సీబీఐ అధికారి రాంసింగ్తో పాటు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అధికార దుర్వినియోగం చేసేందుకే ఈ కేసులు పెట్టినట్లుగా అర్థమవుతోందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో వాదించబోయిన లాయర్ పై అసహనం వ్యక్తం చేసింది. మీపై ఉన్న గౌరవంతోనే జరిమానా విధించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష కూడా వేసే అవకాశం ఉందని సీబీఐ తరపు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో నిందితులు ఒకటి, రెండేళ్లు జైల్లో ఉండటం అన్నది పెద్ద విషయం కాదన్నారు. సాక్ష్యాలను తుడిచి పెట్టే ప్రయత్నం చేయడం, సాక్షులను బెదిరించడంపై పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. అవన్నీ నిరూపితమయ్యాయని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. తదుపరి దర్యాప్తు అవసరమా, నిందితుల కస్టోడియల్ విచారణ అవసరమా, ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్నది తదుపరి విచారణ నాటికి చెప్పాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. వచ్చే నెల 9 కి తదుపరి విచారణను వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు స్పందనతో.. నాటి ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు గుర్తించినట్లయింది. తదుపరి విచారణలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.