జగన్ రెడ్డి ఆలోచనలు, సలహాదారుల తెలివితేటలు ఎలా ఉంటాయో … అలాగే వైసీపీ నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు దినం అని నిర్వహించారు. ఇది ప్రజల్లోకి వేరేగా వెళ్లింది. ప్రజలు ఓడించినందుకు ప్రజల్ని నిందిస్తున్నారని అందుకే అలా వెన్నుపోటు దినాలు నిర్వహించారన్న విమర్శలు వచ్చాయి. అదే రోజున పోటీగా టీడీపీ, జనసేన శ్రేణులు పీడా విరగడ అయి ఏడాది అనే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలనా బాధ్యతలు చేపట్టి ఏడాది కావొస్తోంది. అంటే పన్నెండో తేదీకి ప్రభుత్వం ఏర్పడి అధికారికంగాఏడాది అవుతుంది. సీఎం, డిప్యూటీ సీఎంలు బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతుంది. మరి అప్పుడు వైసీపీ ఏం కార్యక్రమాలు చేస్తుంది.
వెన్నుపోటు దినాన్ని గొప్పగా నిర్వహించాలని పార్టీ నేతల్ని జగన్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి రిపోర్టులు రావాలని అన్నారు. క్యాడర్ కు విందులు ఇచ్చి మరీ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎంత మాత్రం చేశారో జగన్ కు రిపోర్టులు వచ్చి ఉంటాయి. అయితే అసలు ప్రభుత్వం ఏర్పడిన వార్షికోత్సవం పన్నెండో తేదీన జరగాల్సి ఉంది. ప్రభుత్వం, అధికార పార్టీలు ఆ రోజున పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తాయి. మరి వైసీపీ ఏం చేస్తుంది?. తొందరపడి ఏడాది పాలన వెన్నుపోటు అంటూ ర్యాలీలు చేసేశారు. అసలు చేయాల్సిన రోజున చేయడానికి ఏమీ లేకుండా పోయింది.
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజును ఎవరూ వెన్నుపోటు దినం చేయరు. నిరసనలు వ్యక్తం చేయరు. ఎందుకంటే అది ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఓడిపోతాయి కానీ అంతిమంగా ప్రజలు గెలుస్తారు. వారి తీర్పును తక్కువ చేయకూడదు. తమను ఓడించారని.. ప్రజల్ని నిందించలేరు. అందుకే ప్రభుత్వం అధికారికంగా ప్రమాణస్వీకారం చేసిన రోజును వార్షికోత్సవంగా గుర్తిస్తారు. అధికారంలో ఉన్న పార్టీలు సంబరాలు చేసుకుంటాయి. విపక్షంలో ఉన్న పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తాయి. కానీ వైసీపీ ఫలితాలు వచ్చిన రోజునే నిరసనలు వ్యక్తం చేసేసింది. ఇక ప్రభుత్వం ఏర్పడిన రోజు ఏం చేస్తుంది ?
తాను చేసేదే రాజకీయం అని జగన్ అనుకుంటారు. తాము చెప్పిందే వ్యూహం అని సలహాదారులు అనుకుంటారు. బయట జనం ఏమనుకుంటున్నారు.. తమ క్యాడర్ ఏమనుకుంటుందో మాత్రం అసలు తెలుసుకోరు. అందుకే వైసీపీ పరిస్థితి ఇలా తయారయింది.