భారత విదేశాంగ విధానం ఫెయిలయిందని ఇరుగు, పొరుగువారు కూడా మనకు మద్దతివ్వడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడిని చాలా దేశాలు ఖండించాయి కానీ పాకిస్తానే కారణం అని చెప్పలేదు. ఆపరేషన్ సిందూర్ కు నేరుగా ఒక్క దేశం కూడా మద్దతు ప్రకటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో భారత్కు తగిన మద్దతు కూడబెట్టలేకపోయారని పాకిస్తాన్ను ఒంటరిగా చేయడంలో విదేశాంగ విధానం విఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉగ్రదాడులపై పాకిస్తాన్ ను నిందించని అంతర్జాతీయ సమాజం
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో, రష్యా , యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు భారత్ కు మద్దతు ప్రకటించాయి. కానీ కేవలం ఉగ్రవాద దాడులపై సానుభూతి చూపే విషయంలో మాత్రం ఇలా ప్రకటించారు. భారత్ చేసిన దాడులకు అంతర్జాతీయ మద్దతు పరిమితంగానే లభించింది. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఈ సంక్షోభంపై జాగ్రత్తగా స్పందించాయి. పాకిస్తాన్ ను పల్లెత్తు మాట అనలేదు.
ఆపరేషన్ సిందూర్ విషయంలో బారత్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన దేశాలు కొన్నే !
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబించినప్పటికీ, ఇది పాశ్చాత్య దేశాల నుండి విమర్శలను ఎదుర్కొంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరియు ఆర్థిక సంబంధాలను నిర్వహించడంలో భారత్ యొక్క విదేశాంగ విధానం సమర్థత చూపలేదన్న విమర్శలు వస్తున్నాయి. భారత్ “ఆక్ట్ ఈస్ట్” విధానం దక్షిణాసియా ,ఆగ్నేయాసియా ప్రాంతాలలో సమర్థవంతంగా అమలు కావడం లేదని, సరిహద్దు వివాదాలు, పర్యావరణ సమస్యలను సమర్థంగా ఆన్సర్లు చేయలేకపోతున్నారని అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా బృందాలను పంపించి.. వివరించాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇరుగు, పొరుగు భారత్ కు వ్యతిరేకం – తప్పెక్కడ ?
మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో పాకిస్తాన్ ఎప్పటికీ బద్ద శత్రువుగానే ఉంది. చైనా కూడా అంతే. బంగ్లా, శ్రీలంక కూడా ఇప్పుడు భారత్ కు అంత సన్నిహితంగా లేవు. కాస్త దూరంగా ఉండే మాల్దీవ్స్ కూడా భారత్ కు వ్యతిరేకమే. అంతర్జాతీయంగా భారత్ కు సపోర్టుగా ఉండే దేశాల సంఖ్యను చెప్పలేం. అయితే భారత్ ఎవరిపై ఆధారపడటం లేదు. సూపర్ పవర్ గా ఎదిగే ప్రయత్నంలో ఉంది. అందుకే ఆయా దేశాలు ఈర్ష్య పడుతూ ఉండవచ్చు. కానీ నమ్మకమైన మిత్రదేశాలను కొన్నింటిని భారత్ జాబితాలో ఉంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని ఎక్కువ మంది భావన.