ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ సంఘాలు మద్దతు ఇస్తే… సమ్మె మరింత తీవ్రతరం అవుతుందనడంలో సందేహం లేదు. మరో సకల జనుల సమ్మె స్థాయికి ఈ పోరాటం చేరుకుంటుంది. అదే వ్యూహంతో అఖిల పక్షం ఉంది. ఉద్యోగ సంఘాల మద్దతు కోరాలని ప్రయత్నించింది. కానీ, ఈలోగానే సీఎం కేసీఆర్ నుంచి కొన్ని ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం రావడం, వారు ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేయడం, అర్ధగంటపాటు చర్చలు జరగడం అయిపోయింది! అంటే… ఆర్టీసీ కార్మికులు వెళ్లేలోగానే టీఎన్జీవో, టీజీవో నేతలు ప్రగతి భవన్ కి వెళ్లిపోయారు. ఎందుకుంటే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతోనే వెంటనే వెళ్లామని నేతలు అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం దాదాపు ఏడాదిన్నరగా ఇదే టీఎన్జీవో, టీజీవో, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల నేతలు చక్కర్లు కొడుతున్నా సీఎంవో పట్టించుకోలే! ఇప్పుడు హుటాహుటిన సీఎం ఆఫీస్ నుంచి ఆహ్వానం రావడం విశేషం. దీంతో ఆర్టీసీ జేయేసీ నేతలతో సమావేశం జరగకుండా పోయింది.
ఇవాళ్ల టీఎన్జీవో, ఆర్టీసీ సంఘాల నేతల మధ్య భేటీ ఉంటుందని సమాచారం. అయితే, ముందుగా ముఖ్యమంత్రి మనల్ని పిలిచేశారు కాబట్టి… ఆర్టీసీ సమ్మెకు అనుకూలంగా ఈ ఉద్యోగ సంఘాలు మద్దతు ఇస్తాయా లేదా అనేదే అనుమానం! అయితే, సీఎం కేవలం మూడు సంఘాలనే పిలవడంపై ఇతర సంఘాల నేతల్లో అసంతృప్తి వ్యక్తమౌతున్న పరిస్థితీ ఉంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన సన్నిహితుల్ని మాత్రమే పిలుచుకెళ్లారనీ, తమని పట్టించుకోలేదని కూడా ఇతర సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఇతర సంఘాల నుంచి మద్దతు లభించే అవకాశం పూర్తిగా లేదనీ చెప్పలేం.
ప్రస్తుతం ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న కొంతమంది నాయకులు ఉద్యోగ సంఘాల నుంచే వచ్చినవారు కదా! కానీ, ఇప్పుడు వారు నోరెత్తే పరిస్థితి కనిపించడం లేదు. కార్మికుల పక్షపాతులమని గతంలో చెప్పుకుని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్య దగ్గరకి వచ్చేసరికి, ఏ వర్గం నుంచి వచ్చారో ఆ వర్గం ప్రజలు రోడ్డు మీద ఉంటే వారిని పట్టించుకోకుండా… ప్రభుత్వానికి అనుకూలంగా మౌనంగా ఉంటే మరిన్ని విమర్శలు ఎదుర్కొంటారు. ముందుగా ముఖ్యమంత్రి పిలిచేశారు కాదా, ఆయనకే అనుకూలంగా ఉండాలనే ధోరణిలో వీరు వ్యవహరిస్తే… గతంలో వీరు చేసిన పోరాటాలన్నీ రాజకీయ పదవుల కోసమేనా అనే అపవాదు కూడా మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి.