మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నానిని పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు కూడా అరెస్టు అయ్యే జాబితాలో ఉన్నారు. వీరిద్దరూ ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేసేందుకు ఏకంగా పదివేల నకిలీ ఇళ్ల పట్టాలను ముద్రించి పంపిణీ చేశారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని నిర్దారించాయి.
వారిద్దరూ నేర పూరిత కుట్రకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలి చాలా రోజులు అయినప్పటికీ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో పేర్ని నాని విషయంలో ఎందుకు మెదకదనం చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇటీవల మచిలీపట్నంలో ప్రతిష్టాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. దానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకోలేదని. ఇప్పుడు ఆ ఫెస్టివల్ ముగిసిపోయింది కాబట్టి… రెడీ అయ్యారని అంటున్నారు.
బియ్యం మాయం కేసు నమోదయినప్పుడు చాలా రోజుల పాటు భార్యా, పిల్లలను తీసుకుని పేర్ని నాని ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన భార్యను కాపాడుకోవడానికి వెళ్లానని ఆయన చెప్పుకున్నారు. ఇప్పుడు నేరుగా ఆయనపైనే కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు రంగం సిద్ధమయింది. జైలుకెళ్తారా..పారిపోతారా అన్నది తేలియాల్సి ఉంది. నకిలీపట్టాలు ముద్రించి.. తన కుమారుడ్ని కూడా ఆయన జైలుకు తీసుకెళ్తున్నారు. ఇటీవలి కాలంలో పేర్ని నాని పాత పద్దతిలో బూతులు అందుకుంటున్నారు. మెత్తగా ఉంటున్నారని ఆయన అలా మాట్లాడుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.