అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా పోల్చిన జర్నలిస్ట్ కు మద్దతుగా మాట్లాడటమే కాకుండా, ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన మహిళలను రాక్షసులు, పిశాచులు, సంకర తెగ అంటూ దూషించిన సజ్జలకు నోటీసులు పంపిస్తామన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ. వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై సజ్జల వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఏపీ వ్యాప్తంగా సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో రాయపాటి శైలజను కలిశారు రాజధాని ప్రాంత మహిళలు. వైసీపీ నేతలకు మహిళలు అంటే చులకన భావం ఏర్పడిందని, వైసీపీ హయాంలో తమను క్షోభకు గురి చేశారని, ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కక్షపూరితంగా రాజధాని ప్రాంత మహిళలపై విషం కక్కుతున్నారని వాపోయారు.
వైసీపీ 11సీట్లకే పరిమితం కావడానికి రాజధాని ప్రాంత్త మహిళలు కారణమని , అందుకే తమను కించపరిచేలా సజ్జల మాట్లాడారని మహిళా కమిషన్ చైర్మన్ కు కంప్లైంట్ చేశారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ కు కూడా వివరిస్తామని రాయపాటి శైలజ తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం తగదన్న ఆమె, కమిషన్ ఎదుట హాజరై తన వ్యాఖ్యలపై సజ్జల వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.