కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. కానీ అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో.. అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. దాంతో.. జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. కొద్ది రోజుల కిందటే.. జగన్ ఢిల్లీకి వెళ్లి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముప్పావు గంట సేపు సమావేశమయ్యారు. అంతకు ముందు రోజే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. ఆ రోజే.. అమిత్ షాతోనూ.. గంటకుపైగా చర్చలు జరిపారు. కానీ.. జగన్ కు మాత్రం.. తర్వాతి రోజు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. దాంతో.. మోడీతో సమావేశమై తిరిగి వచ్చేశారు. అప్పట్నుంచి షా సమయం కోసం చూస్తున్నారు. ఈ రోజు అమిత్ షా ఢిల్లీలోనే ఉంటారని వచ్చిన సమాచారం మేరకు..ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలోనే ఉండటంతో.. ఆగిపోయారు.
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విషయంలో సీబీఐ ఇటీవలి కాలంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినందున… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని… జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ కౌంటర్ వేసింది. సీఎం అయినందునే మినహాయింపు ఇస్తే.. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొంది. అంతేకాదు.. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని కూడా వాదించింది. బెయిల్ కూడా రద్దు చేయమనేలా.. సీబీఐ వాదనలు ఉండటం వైసీపీ వర్గాల్లోనూ కలకలం రేపింది.
కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించకపోతే… జగన్మోహన్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిగా ఉంటూ.. ప్రతీ వారం కోర్టుకు హాజరయితే… తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజీనామాకు డిమాండ్లు వినిపిస్తాయి. అందుకే… వైసీపీ వర్గాలు … సీబీఐ .. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేలా.. వాదనలు కాస్తంత సున్నితంగా మార్చుకుంటే బాగుటుందనే అంచనాల్లో ఉన్నాయి. వీటి కోసమే.. ప్రస్తుతం వైసీపీ నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాతో సమావేశమైతే.. పరిస్థితుల్లో కొంత మార్పు రావచ్చని వైసీపీ ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. షా మాత్రం సమయం కేటాయించడం లేదు.