సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ ఇచ్చింది. వెంటనే విడుదల చేయమని ఆదేశించింది. తాను వాదించకపోయినా నల్లకోటు వేసుకుని ఢిల్లీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా ముందు సుప్రీంకోర్టు తీర్పును చిలువలు పలువలుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకూ కొమ్మినేని విడుదల కాలేదు. ఎందుకు విడుదల కాలేదో వైసీపీ వర్గాలకూ అర్థం కావడం లేదు. కానీ వైసీపీ లీగల్ టీం నిర్లక్ష్యం వల్లనేనని వారికి క్లారిటీ ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చిన వెంటనే ప్రక్రియ పూర్తి చేసి అదే రోజు కొమ్మినేనిని విడుదల చేయించాల్సింది ఉంది. కానీ ఢీల్లీలోనే ఉన్న పొన్నవోలు సుప్రీంకోర్టు తీర్పు కాపీని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఆ తీర్పు కాపీ సాయంత్రం ఎప్పుడో అందింది. అప్పటికి ఆ రోజుకు సమయం ముగిసిపోయింది. పోనీ శనివారం అయినా ప్రాసెస్ పూర్తి చేస్తారనుకుంటే అదీ చేయలేకపోయారు. కొమ్మినేని జైల్లోనే ఉండనివ్వాలని.. మరీ అంత ఆత్రుత పడవద్దని పెద్దలు చెప్పారేమో కానీ వైసీపీ లాయర్లు నింపాదిగా ఉన్నారు.
ఆదివారం ఏమీ చేయలేరు. జైలు అధికారులు సెలవు రోజున విడుదల చేయరు. ఇక సోమవారం మాత్రమే.. విడుదల చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు.. కింది కోర్టు నుంచి బెయిల్ షరతుల్ని పొందాలని ఆదేశించింది. కింది కోర్టు ఇప్పుడు బెయిల్ షరతులు పెట్టాల్సి ఉంది. ఆ ప్రక్రియ సోమవారం పూర్తవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. కొమ్మినేనికి బెయిల్ వచ్చినా నాలుగైదు రోజులు బయటకు తేలేకపోవడం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
మరో వైపు కృష్ణంరాజు అనే వ్యక్తికి వైసీపీ లీగల్ టీం కూడా ఎలాంటి సాయం చేయడం లేదని చెబుతున్నారు. ఆయన సొంతంగా ఓ లాయర్ పెట్టుకున్నారని అంటున్నారు. కృష్ణంరాజుతో తమకేం సంబంధం లేదని వాదిస్తున్నాం కాబట్టి ఆయనకు సాయం చేయొద్దన్న సంకేతాలు తమ పార్టీ లీగల్ టీమ్కు ఇచ్చారని అంటున్నారు.