మాజీ మంత్రి , వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన నెల్లూరు కోర్టు..అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మూడు రోజులపాటు కాకాణి పోలీసు కస్టడీలో ఉండనున్నారు. అయితే , కాకాణి గోవర్ధన్ రెడ్డిని లాయర్ల సమక్షంలో విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన కాకాణి, నెల్లూరు జిల్లాలో క్వార్జ్ అక్రమ మైనింగ్ చేసినట్లు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. విచారణ కోసం ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అంతకుముందు నోటీసులు ఇస్తే తప్పకుండా సమాధానం చెప్తానన్న కాకాణి.. నోటీసులు రాగానే పారిపోయారు.
ఆ తర్వాత పోలీసులు ఆయన్ను బెంగళూరులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలోనే బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం ఉదయం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ నెల 9వ తేదీకి కేసును వాయిదా వేసింది.
ఈ సాయంత్రం కాకాణి పోలీసు కస్టడీ పిటిషన్ పై నెల్లూరు కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మరింత సమాచారం కోసం కాకాణిని పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరగా.. అందుకు అనుమతి ఇచ్చింది కోర్టు.