దళితుడు సింగయ్యను తన కారుతో తొక్కి చంపేసిన ఘటనతో అయిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకు జగన్ రెడ్డి .. సలహాదారు దిగ్గజాలు మేథోమథనం చేసి ఓ స్క్రిప్ట్ తయారు చేశారు. దాన్ని జగన్ రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టును జగన్ రెడ్డి చదివారో లేదో కానీ చదివి ఉంటే మాత్రం.. తనపై తానే జాలి పడేవారు.
సింగయ్య ఎందుకు చనిపోయాడో .. ఎలా చనిపోయాడో.. వీడియోలు కళ్లే ముందే ఉన్నా.. అదేమీ తెలియనట్లుగా తన సెక్యూరిటీ గురించి మాత్రం చెప్పుకున్నారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ హక్కుగా వస్తుందని ప్రోటోకాల్ ప్రకారం రోప్ పార్టీలు పెట్టలేదని చెప్పుకొచ్చారు. దాని గురించే రెండు పేరాలు రాశారు. అందులో చంద్రబాబుకు భవిష్యత్ లో కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుందన్న బెదిరింపు ఉంది. జగన్ రెడ్డికి సెక్యూరిటీ లేకపోతే జనాలను చంపుతారన్నట్లుగా ఉన్న ఈ ట్వీట్ చూసి.. వైసీసీ నేతలు కూడా షాక్ కు గురవుతున్నారు.
జగన్ రెడ్డి పర్యటనకు పోలీసులు షరతులు పెట్టి అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతుల్ని పట్టించుకోకుండా వెళ్లారు. పైగా ఆయన రోడ్ షో చేస్తారని అనుమతి తీసుకోలేదు. కానీ గుంటూరు దగ్గరకు వచ్చే సరికి జన సమీకరణ చేశారు. పార్టీ కార్యకర్తల్ని పిలింపించుకున్నారు. వారితో రప్పా రప్పా పోస్టర్లు ప్రదర్శించారు. అంతా ఐ ప్యాక్ సెటప్. అందరికీ తెలుసు. ఆయన కారు నుంచి బయటకు వచ్చి.. షో చేసి వెళ్లారు. కావాల్సినంత చేసుకుని ఇప్పుడు సెక్యూరిటీ లేదని చెబుతున్నారు.
కామెడీ ఏమిటంటే గవర్నమెంట్ డ్రైవర్ బండి తోలాడు కాబట్టి గవర్నమెంట్ బాధ్యత వహించాలన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ కారు కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిందేనని కానీ ఇవ్వలేదు కాబట్టి తాను కొన్నానని ఆయన చెప్పుకొచ్చారు. చివరిగా .. ఆయన సింగయ్యకు పదిలక్షలు అంబటి రాంబాబుతో పంపించానని కూడా ఒప్పుకున్నారు. జగన్ రెడ్డి తన ఘోరాల్ని సమర్థించుకోవడానికి తన సెక్యూరిటీ సరిగ్గా లేదని వాదిస్తున్నారు.