ఇంతకాలం ముద్రగడ ఉద్యమం వెనుక వైకాపా ఉందని తెదేపా నేతలు ఆరోపిస్తుండేవారు. వారి ఆరోపణలని ఆయన, వైకాపా నేతలు కూడా గట్టిగా ఖండిస్తుండేవారు. తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని జగన్ సలహాలు, సహకారం తీసుకోవలసిన అవసరం తనకి లేదని ముద్రగడ వాదించేవారు. కానీ ఇప్పుడు వైకాపా నేతలు మొహమాటపడకుండా ఆయనకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి తనని అరెస్ట్ చేస్తే ముద్రగడతో చేతులు కలుపుతానని ప్రకటించారు. అంటే ముద్రగడ ఉద్యమం గురించి తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని నమ్మవలసి ఉంటుంది.
తెదేపాలో మంచి నోరున్న నేతగా పేరొందిన వర్ల రామయ్య తుని విద్వంసం గురించి మాట్లాడిన మాటలు, చేసిన ఆరోపణలు వింటే ఇంక ముసుగులో గుద్దులాడుకోవడాలు లేవ్…బహిరంగంగా ముఖాముఖి యుద్ధమే అని ప్రకటించినట్లుంది. ఈ కేసుకి సంబందించి ఆయన కొన్ని కొత్త విషయాలు కూడా బయటపెట్టారు.
ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “తునిలో అంత విద్వంసానికి పాల్పడే ధైర్యం ముద్రగడ పద్మనాభానికి లేవని మాకు తెలుసు. అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉన్నాయి. ఆ విద్వంసంలో భూమన కరుణాకర్ రెడ్డి యాక్టర్ అయితే, రిమోట్ హైదరాబాద్ లో ఉంది. డ్రోన్స్ తీగ లాగితే లోటస్ పాండ్ కదులుతుంది. ఆ విషయం మానోటితో చెప్పడం కంటే డ్రోన్స్ ఎవరు సరఫరా చేశారో భూమన నోటితోనే చెపితే బాగుంటుంది. తుని విద్వంసంతో తనకి సంబంధం లేదని వాదిస్తున్న భూమన తిరుపతి నుంచి 10 ఏసీ బస్సులలో జనాలని తునికి తరలించారా లేదా? చెప్పాలి. ఈ కేసుతో ఆయనకి ఖచ్చితంగా సంబంధం ఉందని చెప్పడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. సిఐడి పోలీసులు ఆయనని అరెస్ట్ చేయడం ఖాయం. కనుక ఈ కేసులో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు ఊచలు లెక్కించక తప్పదు. ఈ కేసులో నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి దోషులని న్యాయస్థానం ముందు నిలబెట్టవలసిందిగా సిఐడిని కోరుతున్నాను,” అని వర్ల రామయ్య అన్నారు.
ఒకప్పుడు ఓటుకి నోటు కేసులో తెలంగాణా మంత్రులు ఏవిధంగా మాట్లాడేవారో ఇప్పుడు వర్ల రామయ్య కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారని చెప్పక తప్పదు. కేవలం సిఐడి పోలీసులకి మాత్రమే తెలిసిన విషయాలని అయన బయటపెడుతున్నారు. పైగా వారు ఏమి చేయబోతున్నారో..ఏమి చేయాలో కూడా చెపుతున్నారు. ఈ తాజా ఆరోపణలపై భూమన, వైకాపా నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కానీ ఆయన చెపుతున్న ఈ కొత్త విషయాలు నిజమే అయితే తుని విద్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేతలకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.