ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎలా వాడకూడదో అలా వాడిన జగన్ రెడ్డి .. సీఎం హోదా నుంచి నేరుగా ఎమ్మెల్యే స్థానానికి పడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చేసిన తప్పుల్ని రివ్యూ చేసుకోవాల్సిన ఆయన అలాంటిదేమీ లేకుండా తనదైన అసాంఘిక రాజకీయాలను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ప్రజలు పాతాళానికి తొక్కేస్తే.. తనకుపైకి వచ్చే ఉద్దేశమే లేదని తన నీచ రాజకీయంతో ఇంకా ఇంకా గొయ్యి తవ్వేసుకుంటూ పోతున్నారు. ఏడాదిలోనే ఆయన దివాలా తీశారు.
అసెంబ్లీకి పోకపోవడమే అసలైన దివాలా
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి వెళ్లకపోవడంలోనే జగన్ రెడ్డి దివాలా కోరు ఆలోచనలు త్రీ డీలో ప్రజల ముందుకు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లకపోవడం అనే ఆలోచన వస్తే ప్రజాస్వామ్యంలో ఉండటానికి అసలు అర్హుడు కాదు. కానీ జగన్ రెడ్డి అంటేనే అంత.. స్వయం దివాలా ఆలోచనకు ప్రసిద్ధి. అందుకే అసెంబ్లీకి వెళ్లడంలేదు.. తన ఎమ్మెల్యేలను వెళ్లనివ్వడం లేదు. అనర్హతా వేటు వేస్తారన్న భయంతో.. దొంగల్లా వెళ్లి సంతకాలు పెట్టి వచ్చేలా చేసి వారి పరువు తీశారు. హాజరు కోసం ఐదు నిమిషాలు వెళ్లి తమ ఆలోచనలు ఏ స్థాయిలో ఎంత దిగువన ఉంటాయో చూపించారు.
అసాంఘిక శక్తిగా వైసీపీ
వైసీపీ అంటే రౌడీలు, ఖూనీ కోరుల పార్టీ జగన్ స్టాంప్ వేయించుకున్నారు. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని వాళ్లకురాసిచ్చారు. ప్రజల్ని చిత్ర హింసలు పెట్టారు. ఓడిపోయాక.., రాష్ట్రంలోశాంతిభద్రతలను దిగజార్చడానికి ఆ ఆకురౌడీలకు తాను అండగా ఉంటానని తెనాలి పర్యటనతో నిరూపించారు. తెనాలిలో రౌడీలకు మద్దతుతోనే ఆయన ఇమేజ్ మరింత గట్టిపడింది. జగన్ రెడ్డి నేర పూరిత ఆలోచనలు, నేరగాళ్లకు సపోర్టు చేసే విధానంతో.. బాబోయ్ జగన్ అని భయపడేవారిలో మరింత భయం పెంచింది. సామాన్య ప్రజలు మరోసారి ఆయన వైపు చూడాలంటే భయపడే పరిస్థితికి తెచ్చుకున్నారు.
ప్రజల్ని హింసించామే రాజకీయం అనుకుంటే ఎలా?
ప్రజల్ని కష్టాల్లోకి నెట్టి .. వారిని భయపెట్టి.. చిత్రహింసలు పెట్టి.. అభివృద్ధి ఆపేసి.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి చేసేదే రాజకీయం అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. జగన్ రెడ్డి ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏడాది పాటు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా ఉండి.. తన పరిస్థితిని మెరుగుపర్చుకుందామని ప్రయత్నించడం లేదు. మూర్ఖశిఖామణిగా వ్యవహరిస్తూ..పాతాళంలోకి పడిపోయిన తన పార్టీపై మట్టి కప్పేసుకుంటున్నారు. ప్రజలు వెన్నుపోటు పొడిచారని ఫలితాల రోజున ఆందోళనలు చేసిన ఆయన… ప్రభుత్ం కొలువుదీరిన రోజున కూటమి సంబరాలు చేసుకుంటూంటే..తాను ఏం చేయాలో తెలియక దిక్కులు చూసుకుంటున్నారు. ఇంత కంటే దివాలా రాజకీయాలు ఏ నేత అయినా చేయగలరా? . ఆంధ్ర ప్రజల ఖర్మ కాకపోతే!