ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, సభా నిర్వహణలో ఆ పార్టీ వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థపై చర్చ జరపాలంటూ ఇస్తున్న వాయిదా తీర్మానాలు పదేపదే తిరస్కరణకు గురవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు స్వయంగా వైఎస్సార్సీపీ సభ్యుడైనప్పటికీ, ఆయన మండలి సంప్రదాయాలకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
మెజారిటీ ఉన్నా దక్కని పట్టు
మండలిలో బలం ఉంటే ఏ చర్చకైనా పట్టుబట్టవచ్చు, కానీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమవుతోంది. సభా సంప్రదాయాల పేరుతో చైర్మన్ తీర్మానాలను తోసిపుచ్చుతుండటంతో, మెజారిటీ ఉండి కూడా తాము అనుకున్న చర్చను సాధించలేకపోవడం ఆ పార్టీ వైఫల్యంగా మారింది. హెరిటేజ్ వంటి అంశాలపై చర్చకు అనుమతి సాధించలేకపోవడం ప్రతిపక్ష వ్యూహకర్తల బలహీనతను బయటపెడుతోంది. తమ పార్టీకి చెందిన నేతే చైర్మన్ హోదాలో ఉన్నా, తమకు అనుకూలంగా నిర్ణయాలు రాకపోవడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అసహనంతో ఉన్నారు.
చైర్మన్ తీరుపై బొత్స అసంతృప్తి
సభలో ప్రభుత్వం ఇచ్చే జవాబులకే చైర్మన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, విపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని వారు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. బలం ఉన్న సభలో కూడా ప్రభుత్వంపై పైచేయి సాధించలేకపోవడం పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు.
సభలో నిరసన తెలుపుతూ శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించిన తీరు వైఎస్సార్సీపీని ఆత్మరక్షణలో పడేసింది. కాళ్లకు చెప్పులు, బూట్లు ధరించి దేవుడి పటాలను పట్టుకున్న వీడియోలు బయటకు రావడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చాయనే అంశంపై ఎమ్మెల్సీలు చైర్మన్ను తప్పు పడుతున్నారు.
నిర్వీర్యమవుతున్న విపక్ష పోరాటం
ముఖ్యమంత్రి కుటుంబ సంస్థలపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్సార్సీపీ, నిబంధనల సాకుతో చర్చ నిరాకరణకు గురైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించలేకపోతోంది. బలం ఉన్న మండలిని కూడా ఒక వేదికగా వాడుకోలేక పోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కనిపిస్తోంది. పైగా, పవిత్రమైన చిత్రపటాలను రాజకీయం కోసం వాడుకుంటూ అపచారానికి పాల్పడ్డారనే ముద్ర పడటం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. రాజకీయాల్లో కేవలం సంఖ్యాబలం ఉంటే సరిపోదు, సభలో చర్చలు సాధించాలంటే నైతికత , నియమాలపై పట్టు ఉండాలని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. చైర్మన్ మోషేన్ రాజు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా లేదా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్నారా అనే చర్చ పక్కన పెడితే, వైఎస్సార్సీపీ తన బలాన్ని సరైన దిశలో ఉపయోగించలేకపోతోందనేది వాస్తవం. ఇటు సభలోనూ, అటు ప్రజాక్షేత్రంలోనూ సరైన పంథాను అనుసరించకపోవడం వల్లే వైఎస్సార్సీపీ చేతకానితనం పదేపదే చర్చకు వస్తోంది.
