రేవంత్ రెడ్డి పరిపూర్ణ కాంగ్రెస్ నేత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా గాంధీభవన్ లో అడుగుపెట్టారు. ఇదే రోజు (డిసెంబర్ 9) సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో, ఆ వేడుకల్లో భాగంగా రేవంత్ రెడ్డి తొలిసారిగా ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రముఖ నేతల్ని మిత్రులు, సోదరులు, పూజ్యులు, శ్రేయోభిలాషులూ అంటూ పేరుపేరునా రేవంత్ పలకరింపులతో ప్రసంగం మొదలుపెట్టారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం మాత్రమే కాదనీ, దశాబ్దాలుగా ఉన్న తెలంగాణ ఆకాంక్ష కల కాదనీ, ఇది నిజమని, ఉక్కు సంకల్పంతో సోనియా గాంధీ నిర్ణయించిన రోజు అని రేవంత్ చెప్పారు. చరిత్రలో సోనియా గాంధీ జన్మదినం.. తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిన రోజుగా నిలిచిపోతుందన్నారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు అని అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమంలో ఇది మూడో దశ అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ బిడ్డల ఆకాంక్షల్ని సోనియా గాంధీ అర్థం చేసుకుని రాష్ట్రం ఇచ్చారనీ, కానీ కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీలో చేరానన్నారు. అంతేకాదు, తెలంగాణ బిడ్డలు ఇకపై ఏ పార్టీల జెండాలు పట్టుకోవద్దనీ, తమకు ఇష్టమైన తెలుగుదేశం కావొచ్చు, భాజపా కావొచ్చు… వేరే ఏ రంగు జెండాలనూ పట్టుకోవద్దన్నారు. కేసీఆర్ నుంచి విముక్తి కావాలంటే, రాష్ట్రంలో తుది దశ ఉద్యమం సఫలం కావాలంటే ఆ సత్తా ఒక్క మూడు రంగుల జెండాకు మాత్రమే ఉందన్నారు. ఆ తరువాత, తెలంగాణ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడుందని ఆయన ఈ మధ్య అంటున్నారనీ, ఆయనకి కాంగ్రెస్ చరిత్ర తెలియాల్సి ఉందని అన్నారు. గాంధీ, నెహ్రూ, ఆ తరువాత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి ఎంతోమంది గొప్ప నేతలు, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని నాయకుల పార్టీ ఇది అన్నారు. ఆంధ్రాలో పార్టీ తుడిచి పెట్టుకుపోతున్నా, తెలంగాణ బిడ్డల ఆకాంక్షల్ని అర్ధం చేసుకుని రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా అన్నారు.
ఆ తరువాత, కేటీఆర్ మామ గురించి ఓ విషయం చెప్పారు. ఆయన నకిలీ ఎస్టీ ధ్రువ పత్రాలతో ఉద్యోగం చేశారనీ, ఇప్పుడు పెన్షన్ కూడా తీసుకుంటున్నారనీ, ఆ లెక్కన మంత్రి కేటీఆర్ సతీమణి గిరిజన బిడ్డా, గొండుల బిడ్డా, లంబాడా బిడ్డా… తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం వారికి ఉందన్నారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ డిసెంబర్ 9 నుంచి మొదలైందన్నారు. ‘రాసిపెట్టుకో కేసీఆర్.. కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారు. తండాలు తిరుగుతాం, ఊళ్లు తిరుగుతాం, గల్లీ గల్లీలో కేసీఆర్ గురించి మాట్లాడతాం’ అన్నారు. చివరిగా.. జై సోనియా గాంధీ, రాహుల్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ ప్రసంగం ముగించారు.
ఒక పరిపూర్ణ కాంగ్రెస్ నేతగా రేవంత్ తొలి ప్రసంగం ఇది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నోయేళ్ల అనుబంధం ఉన్నట్టుగానే.. తెలంగాణ ప్రకటిస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నట్టుగానే రేవంత్ మాట్లాడటం విశేషం! తెలుగుదేశం ప్రస్థావన వచ్చినప్పుడు ‘మాకు ఇష్టమైన’ అంటూ ఓ విశేషణం చేర్చి మాట్లాడటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాన్నంతా బాగానే ఒంటపట్టించుకున్నట్టు మాట్లాడారు. తెరాస వ్యతిరేక పోరాటానికి తానే ముందుండి నడిపిస్తానని సంకేతాలు కూడా ఇచ్చారు. ఏదైతేనేం, గాంధీ భవన్ లో అడుగుపెట్టిన తొలిరోజునే.. తనలోకి కాంగ్రెస్ భావజాలాన్ని పరిపూర్ణంగా ఆవహించుకున్నట్టుగా రేవంత్ కనిపించారు.