ఈ నెల 21న రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. శర్వానంద్, వరుణ్ తేజ్లు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకలకు రంగం సిద్ధమైంది. `పడి పడి లేచె మనసు` ఈనెల 17న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ అతిథిగా హాజరవుతున్నాడు. 18న `అంతరిక్షం` ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథిగా వస్తున్నాడు. ఈ రెండు సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. `లై` తరవాత హను రాఘవపూడి చేసిన చిత్రం `పడి పడి లేచె మనసు`. మునిపటిలా ప్రయోగాలు చేయకుండా.. ఓ ప్రేమకథని ఎంచుకున్నాడు. శర్వా, సాయి పల్లవిల జోడీనే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మరోవైపు `అంతరిక్షం`ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా చూడొచ్చు. `ఘాజీ`తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంకల్ప్ రెడ్డి.. ఈసారి తలకు మించిన భారమే వేసుకున్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో `అంతరిక్షం` రూపొందించాడు. ఈ రెండు చిత్రాల ఫలితం ఏమిటో ప్రేక్షకులే నిర్ణయించాలి.