అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న… తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారని నిర్ధారిస్తూ.. హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రెండో స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని రూలింగ్ ఇచ్చింది. దీనిపై ఈరన్న సుప్రీంకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాజీనామా చేయడంపై తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏమిటో అర్థం కాక.. .వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. అందుకే.. ఉన్న పళంగా.. హైకోర్టు తీర్పు ప్రకారం రెండో స్థానంలో ఉన్న తమ అభ్యర్థి తిప్పేస్వామితో ప్రమాణం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్పీకర్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఎవరైనా ఎమ్మెల్యే ఏదైనా కారణంతో… అనర్హతా వేటుకు గురైనా.. లేదా ఆ స్థానం ఖాళీ అయినా… ఉపఎన్నిక నిర్వహించాల్సిందే కానీ.. రెండో స్థానంలో ఉన్న వారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చే అవకాశం లేదు. ఈ విషయంలో హైకోర్టు తీర్పును స్పీకర్ కార్యాలంయ అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఎందుకైనా మంచిదని రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయంలో ఈరన్న చేత ఇప్పించారు. ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కొద్ది రోజుల క్రితం.. తెలంగాణలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు పౌరసత్వం లేదని తేలడంతో.. అయన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పారు. ఆ సమయంలో.. రెండో స్థానంలో ఉన్న ఆది శ్రీనివాస్ కు … ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వాలని ఆదేశించారు. కానీ అప్పట్లోనే ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఇలాంటి సందర్భాల్లో రెండో స్థానంలో నిలిచిన వారికి పదవి ఇవ్వడం అనేది సాధ్యం కాదని.. ఉపఎన్నికలు ఉంటాయని స్పష్టత ఇచ్చింది. ఆ తర్వాత చెన్నమనేని రమేష్ కేంద్ర హోంశాఖలో అప్పీల్ చేసి స్టే తెచ్చుకున్నారు. దాంతో ఆ వివాదం ముందుకు సాగలేదు. ఇప్పుడు ఈరన్న ఎన్నిక చెల్లదన్న వివాదం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.