లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ గా జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఈ ఫలితాల నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఏర్పడబోతున్న ప్రతిపక్షాల కూటమికి కూడా మరింత బలం చేకూరినట్టయింది. నిజానికి, ఆ మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగానే ఈ ప్రయత్నానికి పునాదులు వేసింది. దేశంలోని ప్రముఖ పార్టీల అధినేతల్ని ఒకే వేదిక మీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా మరోసారి విపక్ష పార్టీలన్నింటికీ వేదిక మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ.
ఈనెల 17న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్ నాథ్ ప్రమాణం చేయబోతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మరో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గెహ్లాట్ తోపాటు యువనేత సచిన్ పైలెట్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ రెండు కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా హైకమాండ్ నిర్వహించబోతోంది. దీంతోపాటు, విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాలనే లక్ష్యంతో… దేశంలోని అన్ని విపక్షాలకు ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఆహ్వానాలు అందినట్టు సమాచారం. అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్, శరద్ పవార్, ఎమ్.కె. స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతితోపాటు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్టు కాంగ్రెస్ చెబుతోంది.
నిజానికి, భాజపాయేతర కూటమిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కి కనిపిస్తోంది. ఎందుకంటే, భాజపాయేతర, కాంగ్రెసేతర కూటమి అనే నినాదం కూడా నెమ్మది చర్చల్లో ఉంటోంది. పైగా, తెలంగాణలో మరోసారి కేసీఆర్ గెలిచాక ఆయన ఇదే మాట పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ కి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ కూడా రెండు జాతీయ పార్టీలకూ దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ మద్దతు లేని భాజపా వ్యతిరేక పక్షాలు కలిసి ఒక వేదికగా ఏర్పడే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఆ దిశగా తెరాస, తృణమూల్ ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో తమకంటూ పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు దక్కితే… ఈ రెండు పార్టీలూ కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పాలనే భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఒక ఆలోచనా విధానం ఉంది కాబట్టి… వీలైనంత త్వరగా ఇతర పార్టీలను ఆకర్షించాల్సిన పరిస్థితీ, అవసరం కాంగ్రెస్ కి ఎంతైనా ఉంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ మంచి జోష్ మీదే ఉంది.