“పాలన చేపట్టిన వెంటనే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం..! నష్టాల బారి నుంచి కాపాడతాం…!” ఇదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ. దీన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ హామీ ఇచ్చిన తర్వాత ఆర్టీసీకి చెందిన అనేక మంది కార్మికులు… వెళ్లి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు… వారి కల నెరవేరే అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన తర్వాత… టీడీపీ..ఈ హామీపై స్పందించింది. అలా చేయడం అసాధ్యమని… ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య.. నేరుగానే ప్రకటించారు. దీంతో.. వైసీపీ హామీ ఇచ్చింది కాబట్టి.. చేసి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాలన చేపట్టిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న జగన్..!
నిజానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రెడీగా ఉన్నారు. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలోని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. కార్మికులకు 40 శాతం వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని వారి ప్రధానమైన డిమాండ్. 2013 వేతనాల సవరణకు సంబందించిన బకాయలు వెంటనే చెల్లించాలని, అద్దెబస్సులు పెంచే ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని..ఆర్టీసి బస్సులను పెంచాలి వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం తమ 27 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
ఆర్టీసీ విలీనం అసాధ్యం అని ప్రకటించిన టీడీపీ..!
ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థే కానీ.. ప్రభుత్వంలో భాగం కాదు. కార్పొరేషన్ కింద పని చేస్తూ ఉంటుంది. సొంత వ్యవస్థ ఉంటుంది. లాభాలు, నష్టాలు .. అన్నీ ఏపీఎస్ఆర్టీసీనే భరించాల్సి ఉంటుంది. జీతాలు కూడా.. ఆ సంస్థ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారమే ఇస్తారు. ఫిట్మెంట్, పీఆర్సీలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. కానీ.. జగన్మోహన్ రెడ్డి… ఆర్టీసీని నేరుగా ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నారు కాబట్టి… వారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మారిపోతారు. సంస్థ లాభనష్టాలు మొత్తం ప్రత్యక్షంగా ప్రభుత్వ ఖాతాలోకి చేరిపోతాయి. అప్పుడు.. ఆ సంస్థ నష్టాలను భరించడంతో పాటు… ఉద్యోగులకు… పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా.. అన్ని రకాల సౌకర్యాలు అందుతాయి. ఫిట్మెంట్, పీఆర్సీ, వేతన సవరణలు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వస్తాయి. ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల హవా తగ్గుతుంది.
సమ్మెను ఆపేలా.. టీడీపీ వాదన తప్పు అని నిరూపించేలా జగన్ నిర్ణయం..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనే కాబట్టి… ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది.. ఒక్క జీవోతో అయిపోతుంది కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి.. హామీని నెరవేర్చడానికి… సమ్మెను నిలువరించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అలాగే… ఎన్నికలకు ముందు అసాధ్యం అని ప్రకనటలు చేసిన.. తెలుగుదేశం పార్టీ నేతలకూ షాక్ ఇవ్వవొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి… ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తీసుకునే తొలి నిర్ణయాల్లో… ఆర్టీసీ విలీనం ఉంటుందని.. కార్మికులు గట్టిగా నమ్ముతున్నారు. అదే జరిగితే.. ఓ హామీని జగన్ నిలబెట్టుకున్నట్లే.. !
