రెండురోజులపాటు తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయానికి వచ్చారు! ఆయన రాకను కాస్త ప్రత్యేకంగానే అందరూ చూస్తున్న పరిస్థితి! ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన పార్టీ తరఫున ఏమంత యాక్టివ్ గా లేరు. ఒకటీ అర కార్యక్రమాల్లో తప్ప… పెద్దగా కనిపించడం లేదు. ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతూ వస్తున్నారు. అంతేకాదు, ఆయన టీడీపీని వీడబోతున్నారూ, వైకాపాలోకి వెళ్తారని, లేదు భాజపాలో లైన్ క్లియర్ చేసుకున్నారంటూ కథనాలు వచ్చాయి. ఇప్పుడాయన పార్టీ ఆఫీస్ కి రావడంతో అన్నీ పక్కకి వెళ్లిపోయాయి. దీంతో పార్టీ మార్పుపై ఆయన మనసు మార్చుకున్నారా, టీడీపీలోనే కొనసాగాలని అనుకుంటున్నారా అనే చర్చ మొదలైంది.
ఇంతకీ, సొంత పార్టీ మీద ఆయనలో అసంతృప్తి ఏదైనా ఉందా..? ఏదో ఒకటి లేకపోతే పార్టీ నుంచి బయటకి వెళ్తారంటూ ఎందుకు కథనాలు వస్తాయి? అలాంటిదేదీ లేకపోతే కాసేపు వైకాపాలోకి వెళ్తారనీ, భాజపావైపు చూస్తున్నారంటూ మైండ్ గేమ్ ఎందుకు నడిచినట్టు..? ఇదే అంశమై ఆఫ్ ద రికార్డ్ గంటా కొంతమందితో చెబుతూ వస్తున్న విషయం ఏంటంటే… పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నట్టుగా సమాచారం! టీడీపీ ఇప్పుడు అధికారంలో లేదు కదా, ఇప్పుడు కూడా ప్రాధాన్యత అంటే ఇంకా ఏమివ్వాలని గంటా కోరుకుంటున్నట్టు..? ప్రతిపక్ష పార్టీగా ఏదైనా సమస్యలపై పోరాటంలోగానీ, ఇతర అంశాలపైగానీ తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్నది గంటా అసంతృప్తిగా తెలుస్తోంది!
టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా తనకు చంద్రబాబు ఒక్కసారి కూడా ఇంతవరకూ ఫోన్ చేసిన సందర్భం లేదన్నది గంటా అభిప్రాయమంటూ సన్నిహితులు చెబుతున్నారు. అంటే, పార్టీలో ఆయన కీలక స్థానం ఆశిస్తున్న పరిస్థితి ఉందన్నట్టుగా ధోరణి కనిపిస్తోంది. ఇప్పుడు విశాఖకు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి, పార్టీ అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా కలవాలనే వచ్చారుగానీ… గంటాలో ఆ అసంతృప్తి అలానే ఉందట! అంటే, పార్టీ మార్పునకు సంబంధించిన చర్చకు ఇంకా తలుపులు తెరిచే ఉంచారనీ భావించొచ్చు.