తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇవ్వాళ్ళ రాష్ట్ర శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి, వాటికోసం తమ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు, ప్రణాళికల గురించి శాసనసభ సభ్యులకు చాలా చక్కగా వివరించారు. ఇది చూసిన తరువాత ఆంధ్రాలో ప్రాజెక్టులు, వ్యయసాయం ఏవిధంగా ఉందని ఆలోచించకుండా ఉండలేము.
ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి వసతి సౌకర్యాలు, మంచి సారవంతమయిన భూములు కలిగి ఉండటం వలన వ్యవసాయం చాలా చక్కగా అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారుతోంది. తెలంగాణాలో నీటి వసతి లేని భూములకు నీళ్ళు అందించి కొత్తగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే, దేశంలోకెల్లా అత్యంత సారవంతమయిన, మంచి నీటి వసతి సౌకర్యం కలిగిన భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరిట కాంక్రీట్ కట్టడాలు నిర్మించబోతోంది. దానికోసం ప్రభుత్వం రైతుల నుంచి ఏకంగా 34,000 ఎకరాలు సేకరించింది. ఇంకా మచిలీపట్నం పోర్టు, భోగాపురం, గన్నవరం విమానాశ్రయాల కోసం, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పంట భూములనే ప్రభుత్వం ఎంచుకొంటోంది. దానికి రైతులు, ప్రతిపక్షాలు, ప్రజలు, న్యాయస్థానాలు, గ్రీన్ ఫీల్డ్ ట్రిబ్యునల్ ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెపుతున్నా లెక్క చేయకుండా పంటభూముల సేకరణకు పూనుకొని రాష్ట్రంలో వ్యవసాయాన్ని కుదించివేస్తోంది.
ఇలాగ ఒకవైపు సారవంతమయిన, మంచినీటి సౌకర్యం కలిగి ఉన్న భూములపై కాంక్రీట్ కట్టడాల నిర్మాణానికి పూనుకొంటూనే, మరోవైపు కనీసం త్రాగడానికి కూడా నీళ్ళు లేక అల్లాడుతున్న రాయలసీమ జిల్లాలకు పట్టిసీమ ద్వారా నీళ్ళు అందించి అక్కడ ఎండిపోయున్న బీడు భూములకు నీళ్ళు అందించి వ్యవసాయాభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. రాయలసీమ జిల్లాలకు నీళ్ళు అందించడం, కొత్తగా భూములను సాగులోకి తేవడం తప్పకుండా అందరూ హర్షించాల్సిందే. కానీ ఒకవైపు అత్యంత సారవంతమయిన, నీటి సౌకర్యం కలిగిఉన్న భూములను సర్వనాశనం చేసుకొంటూ, మరోవైపు బీడు భూములను సాగులోకి తేవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యలో నిర్మించబోతున్న రాజధాని ప్రభావం అక్కడితో ఆగిపోదు. ఆ రెండు జిల్లాలలో మిగిలిన ప్రాంతాలతో బాటు, చుట్టుపక్కన గల తూర్పు, పశ్చిమ గోదావరి, కడప, కర్నూలు, ఒంగోలు, విశాఖ జిల్లాల వరకు వ్యాపిస్తుంది. ఆకారణంగా ఆయా ప్రాంతాలలో సారవంతమయిన భూములన్నీ కూడా ప్రాజెక్టుల కోసమో లేకపోతే రియల్ ఎస్టేట్ రంగానికో వెళ్లిపోతాయి. అంటే రాజధాని కారణంగా అమరావతి దాని పరిసర ప్రాంతాలలో పంటలు నష్టపోవడమే కాకుండా, రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పంటలు తగ్గిపోవచ్చునని భావించవచ్చును.
ఈ పర్యావరణ విద్వంసం ప్రభావం ఇప్పటికిప్పుడు బయటపడక పోవచ్చును కానీ భవిష్యత్ లో చాలా భయానక పరిణామాలు ఎదుర్కోవలసి రావచ్చును. అదే సమయంలో తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా ఆ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారే అవకాశం ఉంది. ఇద్దరు రాష్ట్రాధినేతల భిన్నమయిన ఈ అభిరుచి వలన ఒక రాష్ట్రం సుసంపన్నమయిన వ్యవసాయ రాష్ట్రంగా మారితే, మరొకటి అత్యాధునికమయిన ‘కార్పోరేట్ రాష్ట్రం’గా అవతరించే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయ రాష్ట్రంలో సామాన్యులు కూడా సుఖ సంతోషాలతో జీవించగలరు కానీ కార్పోరేట్ రాష్ట్రంలో సామాన్యులకు ఆ అవకాశం ఉండకపోవచ్చును.